- సంఖ్య ఎక్కువ చేసి చూపిస్తున్నారన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: మాక్రో ఎకనమిక్ కండిషన్లు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ దృష్ట్యా చూస్తే క్రిప్టో కరెన్సీలు కొంత ఆందోళన కలిగించేవేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం చెప్పారు. బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన బీఎఫ్ఎస్ఐ సమ్మిట్లో దాస్ పాల్గొన్నారు. క్రిప్టో కరెన్సీలపై తమ సజెషన్లను డిటెయిల్డ్గా ఇచ్చామని, వాటిని చురుగ్గా పరిశీలిస్తున్న ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంటుందని పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీలలో ఇన్వెస్టర్ల సంఖ్య భారీగానే పెరుగుతోందని ఆయన చెప్పారు. కానీ, మార్కెట్ చెబుతున్నంత మంది క్రిప్టో ఇన్వెస్టర్లు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సంఖ్యను కొంత ఎక్కువ చేసి చూపిస్తున్నారని పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీలపై రెగ్యులేషన్ లేకపోవడంతో, వాటి పూర్తి డేటా ఆర్బీఐకి అందుబాటులో ఉండవని అన్నారు. క్రిప్టో ఇన్వెస్టర్లలో 70 శాతం మంది రూ. 1,000 నుంచి రూ. 2,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్లేనని, బహుశా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉండాలనే ఉద్దేశంతోనే అలా చేస్తుండొచ్చని పేర్కొన్నారు. మాక్రో ఎకనమిక్ కండిషన్లు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ప్రకారం చూస్తే సెంట్రల్ బ్యాంకుగా తమకు క్రిప్టో కరెన్సీలపై అభ్యంతరాలున్నాయని మరోసారి దాస్ వెల్లడించారు. ఏదేమైనా మేమిచ్చిన సూచనలు, సలహాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం తీసుకోవల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
నా దగ్గర క్రిప్టో కరెన్సీ ఉంది.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్
వ్యక్తిగతంగా తన వద్ద క్రిప్టో కరెన్సీ ఉన్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. న్యూయార్క్ టైమ్స్ డీల్బుక్ ఆన్లైన్ కాన్ఫరెన్స్లో కుక్ మాట్లాడారు. ఈ సందర్భంగా బిట్కాయిన్ వంటి క్రిప్టోలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గత కొంత కాలంగా క్రిప్టో కరెన్సీలపై ఆసక్తి పెరిగిందని, ఫలితంగా తాను వాటిపై రీసెర్చ్ చేస్తున్నానని కుక్ పేర్కొన్నారు. పోర్ట్ఫోలియోలో భాగంగా క్రిప్టో కరెన్సీలూ ఉండాలనుకుంటున్నానని వివరించారు. అయితే, తాను క్రిప్టోలపై ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ సలహాలూ ఇవ్వడంలేదని స్పష్టం చేశారు.
క్రిప్టోవైపు యాపిల్ చూపు...
క్రిప్టో కరెన్సీ వైపు యాపిల్ చూస్తోందని కూడా టిమ్ కుక్ వెల్లడించారు. కానీ, వెంటనే క్రిప్టోను యాపిల్ పేలో లాంఛ్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. టెస్లాలా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టే ఉద్దేశం యాపిల్కు లేదన్నారు. యాపిల్ ఇన్వెస్టర్లు క్రిప్టోల కోసం యాపిల్ షేర్లను కొనడం లేదన్నారు. తమ ప్రొడక్టులకు క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేసే ప్రపోజల్ కూడా వెంటనే ఏమీ లేదని చెప్పారు. క్రిప్టో ప్రపంచంలో ఎన్ఎఫ్టీ ఆసక్తికలిగిస్తున్నాయన్నారు.
కమీషన్ సమంజసమే..
యాప్ స్టోర్లో వసూలు చేసే కమీషన్ సమంజసమైనదేనని టిమ్ కుక్ కాన్ఫరెన్స్లో సమర్ధించుకున్నారు. డెవలపర్లలో ఎక్కువ మంది నుంచి పూర్తి 30% కాకుండా, 15 శాతాన్నే వసూలు చేస్తున్నట్లు చెప్పారు. యాప్ స్టోర్లో మరిన్ని మార్పులు భవిష్యత్లో రానున్నాయని తెలిపారు. యాప్ స్టోర్ నుంచి కాకుండా ఆన్లైన్లో లేదా ఇతర మార్గాలలో యాప్లు డౌన్లోడ్ చేసుకునే వాళ్లు ఐఫోన్ కాకుండా యాండ్రాయిడ్ ఫోన్లు కొనుక్కోవచ్చన్నారు.