‘వాసాలమర్రి’ డెవలప్​మెంట్ డీటెయిల్స్​ పంపండి : సీఎస్

‘వాసాలమర్రి’ డెవలప్​మెంట్ డీటెయిల్స్​ పంపండి : సీఎస్
  • జిల్లా అధికారులకు చీఫ్​సెక్రటరీ ఆదేశాలు
  • గతంలో డీపీఆర్​ పంపినా.. మళ్లీ  పంపాలని ఆర్డర్స్​
  •  రెండేండ్లుగా ఏం చేసిండ్రని ఆఫీసర్లకు​ క్లాస్..
  • డీపీఆర్​తో కుస్తీ పడుతున్న ఆఫీసర్లు

యాదాద్రి, వెలుగు : సీఎం కేసీఆర్ ​దత్తత గ్రామం.. ఇన్నొద్దులకు ప్రభుత్వానికి గుర్తొచ్చింది. వాసాలమర్రిలో  రెండేండ్లుగా ఎలాంటి డెవలప్​మెంట్​ జరగక పోవడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు తీవ్రమైన నేపథ్యంలో  సీఎస్​ సోమేశ్​కుమార్ ​రంగంలోకి  దిగారు. అభివృద్ధి పనులు వివరాలు పంపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆరు నెలలుగా డీపీఆర్ వద్దే ఆగినా.. ఏం చేస్తున్నారని క్లాస్​ తీసుకున్నారు. మళ్లీ ఫుల్​డీటెయిల్స్ పంపాలని ఆర్డర్స్​ఇచ్చారు.  ఏ పనికి ఎంత ఖర్చు అవుతుందో?  లెక్కలతో సహా పంపాలని ఆదేశించారు. మీడియాలో కథనాలు వస్తుంటే రెండేండ్లుగా ప్రపోజల్స్​పంపకుండా ఏం చేస్తున్నారని ఆఫీసర్లపై సీఎస్​ సీరియస్​అయినట్లు తెలుస్తోంది. దీంతో  ఆఫీసర్లు డీపీఆర్​ ముందు పెట్టుకొని కుస్తీ పడుతున్నారు. 

గతంలో జరిగింది ఇదీ..

2020 నవంబర్​ 1న సీఎం కేసీఆర్​ వాసాలమర్రిని దత్తత తీసుకున్నారు. రూ. 100 కోట్లతో  గ్రామాన్ని మోడల్​విలేజ్​గా డెవలప్​చేసుకుందామని ప్రకటించారు. అదే నెలలో డిపార్ట్​మెంట్ల వారీగా జిల్లా అధికారులు రంగంలోకి దిగి వాసాలమర్రిలో ఉన్న ఇండ్లు, జనాభా సహా ఫుల్​ డీటెయిల్స్ ప్రభుత్వానికి అందించారు.  ప్రజలు  ఏమేమి అడిగారో.. రిపోర్టులో పేర్కొన్న ఆఫీసర్లు వాటిని సమకూర్చడానికి ఎంత ఖర్చువుతుందో కూడా లెక్కలు వేసి మరీ డీపీఆర్​పంపారు. 2021 జూన్​ 22న  వాసాలమర్రికి వచ్చిన  సీఎం కేసీఆర్ కలిసికట్టుగా పని చేసి.. బంగారు వాసాలమర్రి సాధించుకోవాలని సూచించారు. 2021 ఆగస్టు 4న మరోసారి వచ్చిన సీఎం  ఎస్సీ కాలనీలో పర్యటించి ఇక్కడే దళితబంధు అమలు చేస్తానని ప్రకటించారు. అదే రోజు గ్రామంలో మాట్లాడుతూ.. ‘ ఊర్లో అన్నీ పెంకుటిండ్లే ఉన్నాయి..  మొత్తం కూలగొట్టి ఆరేడు నెలల్లో కొత్తగా ఇండ్లు కట్టుకుందాం’ అని గ్రామస్తుల మధ్యే ప్రకటించారు. దీంతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు రూ. 165 కోట్లతో మరోసారి డీపీఆర్​ రూపొందించి జులై 2022లో అందించారు. 

డీపీఆర్​ పంపించి ఆరు నెలలు

సీఎం పేషీకి డీపీఆర్​ పంపించిన ఆఫీసర్లు, వాసాలమర్రిలో కొత్త ఇండ్లకు పర్మిషన్​ఇవ్వొద్దని  పంచాయతీకి ఆదేశాల జారీ చేశారు. దీంతో ఇండ్ల నిర్మాణం కోసం ఎవరూ పర్మిషన్​అడిగినా ఇవ్వకపోవడంతో  గ్రామంలో కొత్త ఇండ్ల నిర్మాణం నిలిచిపోయింది. డీపీఆర్​ అందించి ఆరు నెలలు గడిచినా ఏ రూపంలోనూ ఫండ్స్​రాలేదు.  కానీ ఎర్రవెళ్లి నుంచి యాదగిరిగుట్ట వరకు వెళ్లేందుకు కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు మాత్రం సాగుతున్నాయి. ఇంటి నిర్మాణ పనులకు  పర్మిషన్లు ఇవ్వకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ విషయం కాస్తా గత నెల 17న ‘వెలుగు’లో  ‘వాసాలమర్రి ఎట్టున్నదో అట్టనే’ హెడ్డింగ్​తో వార్త పబ్లిష్​ అయ్యింది. 

ఈ వారంలోనే  కొలిక్కి?

దత్తత తీసుకున్న రెండేండ్లకు వాసాలమర్రి ఓ కొలిక్కి వచ్చే అవకాశం కన్పిస్తోంది. జిల్లాఫీసర్ల నుంచి పూర్తి వివరాలు అందగానే వాటిలోని ప్రయారిటీ అంశాలు పరిగణలోకి తీసుకుంటారని సమాచారం.  ఆ తర్వాత వాపాలమర్రి డెవలప్​మెంట్​పై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

వాసాలమర్రికి ఇవి కావాలి

2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో 1,628 మంది ఉండగా, తాజా లెక్కల ప్రకారం 2,400 జనాభా ఉందని ఆఫీసర్లు తేల్చారు. 2020–-21లో నిర్మించిన ఇండ్లు దాదాపు 150 ఉండగా, కొత్తగా 500  వరకూ ఇండ్లు నిర్మించాల్సి ఉంటుందని ఆఫీసర్లు అంచనాకు వచ్చారు. పంచాయతీ బిల్డింగ్​,3 అంగన్​వాడీ సెంటర్లు, ప్రైమరీ హెల్త్​ సెంటర్​, రేషన్​ షాపు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు గతంలో పేర్కొన్న మినీ మార్కెట్​, పార్కు, ఫంక్షన్​ హాల్  కట్టాల్సి ఉంటుంది.