- ధోనీతో ధోనీ
- వరల్డ్ కప్ ఫైనలే నా బెస్ట్ ఇన్నింగ్స్
- 80 బైక్స్ ఉన్నాయి
హైదరాబాద్: లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ పట్టాన ఎవ్వరికీ అర్థం కాడు. ఫీల్డ్లో అతని కెప్టెన్సీ, నిర్ణయాలే కాకుండా బయట అతని వ్యవహారశైలి కూడా రెగ్యులర్ క్రికెటర్లకు పూర్తి భిన్నం. వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్రికెట్ స్టార్లలో ఒకడైనప్పటికీ సాదాసీదాగా కనిపిస్తాడు. బాహ్య ప్రపంచానికి, మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. క్రికెట్ ఆడినప్పుడు మ్యాచ్ల టైమ్లో తప్పితే అతను మీడియా ముందుకొచ్చి తన అంతరంగాన్ని వివరించిన సందర్భాలు లేవు అలాంటి ధోనీ తొలిసారి మనసు విప్పాడు. ఎదురుగా కూర్చున్న మరో ధోనీతో మాట్లాడాడు. ఇండియా వరల్డ్కప్ గెలిచి శుక్రవారంతో పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా ‘ధోనీ వర్సెస్ ధోనీ’ అనే పేరుతో మహీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఓ ఆయిల్ కంపెనీ రూపొందించిన ప్రత్యేక వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ శుక్రవారం రిలీజ్ చేసింది. 2005 నాటి యంగ్ ధోనీ.. 2021 ధోనీ మధ్య జరిగే ఆసక్తికరంగా సాగిన డిస్కషన్లో మాజీ కెప్టెన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
నీ హార్డ్ వర్క్ వల్లే కప్ గెలిచాం
తన ఇంటర్నేషనల్ కెరీర్లో 2011 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ తన ఆల్టైమ్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని మహీ అన్నాడు. 2019 వరల్డ్కప్ అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ 2021 కోసం రెడీ అవుతున్నాడు. ధోనీ వర్సెస్ ధోనీ డిస్కషన్లో భాగంగా మీ ఫేవరెట్ ఇన్నింగ్స్ ఏది అంటూ యంగ్ ధోనీ ప్రశ్నించగా.. వరల్డ్ కప్ ఫైనల్ అని సీనియర్ బదులిస్తాడు. అనంతరం తన జూనియర్కు ధోనీ పలు సలహాలిచ్చాడు. ‘అనుభవం వల్ల చాలా విషయాలు ఈజీ అయిపోతాయి. అదే సమయంలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఎక్కువ మ్యాచ్లు ఆడావంటే.. నిన్ను కట్టడి చేసేందుకు ప్రత్యర్థి ఓ ప్లాన్తో వస్తాడు. అందువల్ల నీ ఆటను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలి. ప్రస్తుతం నువ్వు మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నావు. కొన్ని రోజుల తర్వాత లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావాల్సి ఉంటుంది. అక్కడ నీ బాధ్యతలు వేరుగా ఉంటాయి. దాని కోసం నువ్వు మెంటల్గా రెడీ అవ్వాలి. సవాళ్లు ఎదురవుతుంటేనే ప్రూవ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడటం అన్నింటికంటే ముఖ్యం’ అని సీనియర్ ధోనీ వివరించాడు. ఇక, ఫేవరెట్ ఇన్నింగ్స్ ఏదంటూ జూనియర్ అడిగిన ప్రశ్నకు మరో ఆలోచనే లేకుండా వరల్డ్కప్ ఫైనల్ అని బదులిచ్చాడు. ‘ఆ మ్యాచ్ ఫినిష్ చేసిన ఆనందాన్ని మించింది మరొకటి లేదు’ అన్నాడు. దాంతో, మనం వరల్డ్కప్ గెలిచామా అంటూ 2005 నాటి మహీ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. నీ హార్డ్ వర్క్ వల్లే అది సాధ్యమైందంటూ సీనియర్ చెబుతాడు. ‘ఇందుకోసం నువ్వు.. నీకిష్టమైన బటర్ చికెన్, సాఫ్ట్ డ్రింక్స్, మిల్క్ షేక్స్ త్యాగం చెయ్యాల్సి ఉంటుంది’అని చెప్పుకొస్తాడు. ఇక, బైక్స్పై ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదని చెప్పిన మహీ తన దగ్గర 80 బైక్స్ ఉన్నాయని వెల్లడించాడు. ఫస్ట్ బైక్ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నానని చెప్పడంతో వీడియో ముగుస్తుంది.
ఉ.4.30 దాకా ఎంజాయ్ చేశాం.. నిద్రలేచాక ధోనీని చూసి షాకయ్యాం: టీమ్ మేనేజర్
2011 వరల్డ్ కప్ నెగ్గిన రోజు రాత్రంతా టీమిండియా ప్లేయర్లు పార్టీ చేసుకున్నారు. స్టేడియం నుంచి వెళ్లాక హోటల్లోనూ ఎర్లీ మార్నింగ్ వరకూ సెలబ్రేషన్స్ కొనసాగాయి. ఆ తర్వాత అందరూ తమ రూమ్స్కు వెళ్లిపోయారు. మార్నింగ్ లేచిన తర్వాత గుండుతో కనిపించిన ధోనీ అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చాడు. తమ వరల్డ్కప్ జర్నీలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అదేనని నాటి టీమ్ మేనేజర్ రంజిబ్ బిస్వాల్ చెప్పాడు. ‘ఫైనల్ తర్వాతి రోజు మార్నింగ్ ఏం చూడబోతున్నామో మాకు అస్సలు ఐడియానే లేదు. ఆ రోజు అర్ధరాత్రి వరకూ డ్రెస్సింగ్ రూమ్లో సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత హోటల్కు వచ్చి మార్నింగ్ 4.30 వరకూ ఎంజాయ్ చేశాం. చివరకు అలసిపోయి ఎవరి రూమ్స్కు వాళ్లం వెళ్లిపోయాం. నిద్రలేచిన తర్వాత హెడ్ షేవ్ చేసుకున్న (గుండు) ధోనీ తన రూమ్ నుంచి బయటికి రావడం చూసి షాకయ్యాం. మాకెప్పటికీ గుర్తుండిపోయే క్షణం అది. మహీని అలా చూస్తామని ఎవ్వరం ఊహించలేదు. ఎందుకంటే సెలబ్రేషన్స్ పూర్తయ్యేంత వరకూ తను మాతోనే ఉన్నాడు. ఆ తర్వాతే రూమ్కు వెళ్లి హెడ్ షేవ్ చేసుకున్నాడు. తన ప్లాన్స్ గురించి ముందుగా ఎవ్వరికీ చెప్పలేదు. ధోనీ అంటేనే అది. తన భావోద్వేగాలను ఎప్పుడూ గుండెల్లోనే దాచుకుంటాడు. బయటకు ఎక్స్ప్రెస్ చేయడు’ అని రంజిబ్ చెప్పుకొచ్చాడు.