- రైతులతో పంటలేయించి కొనుగోలుకు ఆగ్రోస్ ఒప్పందం
- పైలెట్ ప్రాజెక్టుగా మహబూబ్నగర్ ఎంపిక
- ప్రాసెస్, ప్యాకింగ్ చేసి ఔట్లెట్ల ద్వారా అమ్మకం
- నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి.. స్టాల్స్ పెట్టించి ఉపాధి
రైతులతో అగ్రిమెంట్
మిల్లెట్స్ సాగును ప్రోత్సహించడానికి, రైతులతో ముందే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకుంటున్నం. ప్రాసెసింగ్ చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నం. మిల్లెట్స్ పంటలను సాగు చేయించడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను ఎంచుకున్నం. రైతులతో సాగు చేయించి మేమే కొంటాం. ప్రాసెసింగ్, ప్యాకింగ్ తర్వాత మార్కెట్ చేస్తం
- కె.రాములు, ఎండీ, ఆగ్రోస్
మిల్లెట్స్పై కేంద్రం ఫోకస్
దేశవ్యాప్తంగా మిల్లెట్ సాగు 40 లక్షల హెక్టార్ల నుంచి13 లక్షల హెక్టార్లకు పడిపోయింది. దేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి17 మిలియన్ టన్నుల మిల్లెట్స్ ఉత్పత్తి జరుగుతోంది. ఐఐఎంఆర్ నుంచి ఏటా10 వేల క్వింటాళ్ల మిల్లెట్ సీడ్స్ అందిస్తున్నం. రైతులు సాగు చేస్తే అందరికీ తక్కువ ధరలో మిల్లెట్స్ అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సహిస్తోంది.
- డాక్టర్ విలాస్ ఏ తోనపి, డైరెక్టర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్
హైదరాబాద్, వెలుగు: కొర్రలు, సామలు, సజ్జలు, రాగులు, జొన్న, అరికెలు, వరిగలు, ఊదలు ఇవన్నీ రాష్ట్రంలో ఒక్కప్పుడు ప్రజల ప్రధాన ఆహారం. కానీ ఇప్పుడు మనం మిల్లెట్స్పూర్తిగా పక్కన పెట్టేశాం. కల్తీ, మందుల ఫుడ్ తో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. రోజుకు 400 గ్రామాలు మిల్లెట్స్ ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని, కనీసం 120 గ్రాముల మిల్లెట్స్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ స్పష్టం చెబుతోంది. మిల్లెట్స్ ప్రాధాన్యం గుర్తించిన యూఎన్వో 2023ను మిల్లెట్ ఇయర్గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాయి.
ఒప్పంద సాగులో ఆగ్రోస్..
చిరుధాన్యాలను మార్కెట్లో మద్దతు ధరతో సర్కారు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ముందుకు రావడం లేదని గుర్తించిన ప్రభుత్వ రంగ సంస్థ ఆగ్రోస్ పంట కొనుగోలుకు సిద్ధమైంది. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని మిల్లెట్స్ను సాగు చేయించాలని ప్లాన్ రూపొందించింది. రాగి, కొర్ర, జొన్నలను ఇతర చిరుధాన్యాలను సాగు చేయించి, ఆగ్రోస్ సంస్థే కొనుగోలు చేయనుంది. పంటలను ప్రాసెసింగ్ చేయించి, ప్యాకింగ్ చేసి ఆగ్రోస్ మార్కెట్లోకి సరఫరా చేస్తారు. నిరుద్యోగ యువతకు ఆగ్రోస్ శిక్షణ ఇప్పించి వారికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించి స్టాల్స్ ఏర్పాటు చేయించి మిల్లెట్స్ అందుబాటులోకి తేనుంది.
తగ్గిన సాగు విస్తీర్ణం..
నాలుగు దశాబ్దాల క్రితం వరకు ఆశాజనకంగా ఉన్న చిరుధాన్యల సాగు కొన్నాళ్లుగా భారీగా తగ్గిపోయింది. జొన్నలు, సజ్జలు, రాగులు, ఇతర మిల్లెట్ల సాగు కలిపి ఈఏడాది కనీసం 60 వేల ఎకరాలు కూడా లేకపోవడం గమనార్హం. గతంలో లక్ష ఎకరాలకుపైగా సాగయ్యే జొన్నలు సగానికి పడిపోయాయి. సజ్జలు 2,992 ఎకరాల నుంచి 474 ఎకరాలు, రాగులు 2,698 ఎరాల నుంచి 294 ఎకాలకు పడిపోయాయి. దీంతో 40 శాతం కొరత ఏర్పడుతోంది.