
- సౌతాఫ్రికాపై 304/2 స్కోరుతో ఇంగ్లండ్ రికార్డు
- ఫిల్ సాల్ట్ భారీ సెంచరీ
మాంచెస్టర్: ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో మునుపెన్నడూ చూడని విధ్వంసం. ఈ ఫార్మాట్లో మేటి జట్లను ఊరిస్తున్న 300 రన్స్ మార్కును ఇంగ్లండ్ అందుకుంది. సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఫిల్ సాల్ట్ (60 బాల్స్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 141 నాటౌట్) భారీ సెంచరీతో విజృంభించిన వేళ ఇంగ్లిష్ టీమ్ 20 ఓవర్లలో 304/2 స్కోరు చేసింది.
ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇది మూడో అత్యధిక స్కోరు
జింబాబ్వే ( జాంబియాపై 344/4), నేపాల్ (మంగోలియాపై 314/3) టాప్–2లో ఉన్నాయి. అయితే, ఐసీసీ ఫుల్ మెంబర్ 300 ప్లస్ స్కోరు చేయడం ఇదే తొలిసారి. ఇండియా గతేడాది హైదరాబాద్లో బంగ్లాదేశ్పై 297/6 స్కోరు చేసింది. ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక స్కోరు అందుకున్న ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్గా ఇంగ్లండ్ రికార్డుకెక్కింది. శుక్రవారం (సెప్టెంబర్ 12) రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లిష్ టీమ్ మరికొన్ని రికార్డులు బ్రేక్ చేసింది.
ఓపెనర్ సాల్ట్.. ఇంగ్లండ్ తరఫున టీ20ల్లో హయ్యెస్ట్ స్కోరు చేసిన ప్లేయర్గా నిలవడంతో పాటు ఫాస్టెస్ట్ సెంచరీ (39 బాల్స్లో) కూడా కొట్టాడు. జోస్ బట్లర్ (30 బాల్స్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 83) విజృంభించాడు. అనంతరం జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో సత్తా చాటడంతో ఛేజింగ్లో సౌతాఫ్రికా 16.1 ఓవర్లలో 158 రన్స్కే కుప్పకూలింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (41) టాప్ స్కోరర్. ఫలితంగా 146 రన్స్ తేడాతో గెలిచిన ఇంగ్లండ్.. ఈ ఫార్మాట్లో అతి పెద్ద విజయం అందుకుంది.
రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 462 రన్స్ నమోదవడంతో ఈ పోరు మెన్స్ టీ20ల్లో అత్యధిక రన్స్ వచ్చిన మ్యాచ్గా రికార్డుకెక్కింది. ఫిల్ సాల్ట్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 1–1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరి, మూడో టీ20 ఆదివారం జరగనుంది.