కామారెడ్డి, వెలుగు:పొలం వద్ద కాలిపోయిన మోటార్ను తొలగిస్తుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. బోరు మోటార్ను పైకి తీస్తుండగా ఇనుప పైపులకు కరెంటు తీగలు తగలడంతో ముగ్గురికి షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయారు. సోమవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వెల్పుగొండ గ్రామంలో ఈ దారుణం జరిగింది. రైతుల కుటుంబ సభ్యులు, పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. వెల్పుగొండ గ్రామానికి చెందిన స్వామిగౌడ్ పొలంలో వ్యవసాయ బోరుల మోటార్కాలిపోయింది. అదే గ్రామానికి చెందిన రైతులు ఐలేని గడీల మురళీధర్రావు(52), ఐలేని లక్ష్మణ్రావు(60) గ్రామంలో బోరు మోటార్లు కాలిపోయినప్పుడు బోరు నుంచి పైకి లాగుతుంటారు.
వీరు తమకు పరిచయం ఉన్న ఇమ్మడి నారాయణ(50)ను తీసుకుని బోరులో నుంచి మోటార్ను పైకి లాగేందుకు వెంట తీసుకెళ్లారు. తొలుత మరో చోట బోరులో నుంచి మోటార్ను మురళీధర్రావు, లక్ష్మణ్రావు, నారాయణ కలిసి పైకి తీశారు. ఆ తర్వాత స్వామిగౌడ్ పొలం వద్దకు వెళ్లి అక్కడ కాలిపోయిన మోటార్ను పైకి లాగే పనులు మొదలు పెట్టారు. ఆ సమయంలో అక్కడ స్వామిగౌడ్ లేడు. బోరు పైనుంచి కరెంట్ లైన్ వైర్లు వెళ్లాయి.
ఆ సమయంలో కరెంట్ సరాఫరా ఉంది. ఈ వైర్లను గమనించకుండా వీరు ముగ్గురూ మోటార్ను పైకి తీస్తుండటంతో కరెంట్ తీగలకు ఇనుప పైప్కు తాకి షాక్తగిలింది. ఇనుప పైపు పట్టుకుని ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. మురళీధర్రావు, నారాయణ, లక్ష్మణ్రావు మరణవార్త తెలిసి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. మురళీధర్రావు, ఇమ్మడి నారాయణ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి పని చేశారు. ఆ తర్వాత తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. నారాయణ నెల రోజుల్లో గల్ఫ్ వెళ్లాల్సి ఉందని గ్రామస్తులు చెప్పారు.