- తొలి దశలో 8,800 ఇళ్లకు స్మార్ట్ మీటర్లు
- ఎస్ఎంఎస్ ద్వారా కరెంటు బిల్లులు
హైదరాబాద్, వెలుగు: ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ‘కరెంటు స్మార్ట్ గ్రిడ్’ ప్రారంభమైంది. దక్షిణ తెలంగాణ కరెంటు పంపిణీ సంస్థ(టీఎస్ఎస్ పీడీసీఎల్) సీఎండీ రఘు మారెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని జీడిమెట్లలో పైలట్ ప్రాజెక్టును ఆరంభించారు. దాదాపు 8,800 ఇళ్లకు సింగిల్ ఫేజ్ స్మార్ట్ మీటర్లు అమర్చారు. జీడిమెట్లలోని 44 సబ్ స్టేషన్లను స్మార్ట్ గా మార్చేందుకు 11 కేవీ ఫీడర్లలో ఆటో రే క్లోజర్స్, సెక్షనలైజర్స్, రింగ్ మెయిన్ యూనిట్స్, ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్స్ తదితర పరికరాలను అమర్చారు. స్మార్ట్ గ్రిడ్ కు ఈసీఐఎల్ టెక్నాలజీ సాయం చేయగా, కేంద్ర ఇంధన శాఖ రూ.50 కోట్ల ఆర్థిక సహకారం అందించింది. స్మార్ట్ గ్రిడ్ పూర్తి చేయడానికి రూ.41.82 కోట్లు ఖర్చైనట్లు సీఎండీ రఘు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు ఫలితాలను విశ్లేషించుకుని, స్మార్ట్ మీటరు విధానాన్ని ఇతర ప్రాంతాల్లో అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరక్టర్లుటి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్ రెడ్డి, కె.రాములు, సి.హెచ్.మదన్ మోహన్ రావు, ఎస్. స్వామి రెడ్డి, పి.నరసింహరావు పలువురు ఆఫీసర్లు పాల్గొన్నారు.
స్మార్ట్ గ్రిడ్ ప్రయోజనాలు:
ప్రీ పెయిడ్ విధానం ద్వారా కరెంటు బిల్లులు
ఎంత కరెంటు వాడారో ఎప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయం
ఏ టైంలో ఎంత కరెంటు వాడారో తెలుసుకోవచ్చు
ఎస్ఎంఎస్తో యూజర్లకు కరెంటు బిల్లుల వివరాలు
కరెంటు నిలిపివేతలు ఉంటే ముందస్తు సమాచారం
11 కేవీ ఆటోమేషన్ వల్ల లాభాలు
ఇందులో ఒక లైన్ ను మూడు, నాలుగు భాగాలుగా విభజిస్తారు. లైన్లో ఏదైనా భాగం దెబ్బతింటే కేవలం దాని వరకూ మాత్రమే కరెంటు సరఫరా నిలిచిపోతుంది. -ప్రకృతి విపత్తుల సమయంలో ఏ లైన్లో ఎక్కడ నష్టం జరిగిందో వెంటనే తెలుస్తుంది.