
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఆగస్టు 15 నుండి ఫాస్ట్ ట్యాగ్ ఏడాది పాస్ ప్రారంభించనుంది. దింతో ఇక జాతీయ రహదారులపై ప్రయాణాలు మరింత సౌకర్యంగా మారుతాయి. ఈ పాస్ తో ప్రతిసారి ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్లు లేదా పదేపదే టోల్ చార్జీలు కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే జాతీయ రహదారులపై సాఫీగా ప్రయాణించొచ్చు.
ఫాస్ట్ ట్యాగ్ ఏడాది పాస్ : ఫాస్ట్ ట్యాగ్ ఏడాది పాస్ అనేది భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన టోల్ పాస్, ఈ పాస్ ఎక్కువగా హైవే పై ప్రయాణించేవారికి ప్రయాణ సమయంలో ఇబ్బంది లేకుండా చేస్తుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించిన ఈ పాస్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్/సొంత వాహనాలు 200 వరకు టోల్ క్రాసింగ్లు లేదా ఒక ఏడాదికి మొత్తంగా రూ. 3,000 ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.3,000తో 200 సార్లు టోల్ గేట్స్ వద్ద ఫ్రీగా దాటొచ్చు. ఈ పాస్ టోల్ గేట్స్ దగ్గర క్యూలో ఉండడం, ట్రాఫిక్ రద్దీ, ప్రయాణికుల టైం వెస్ట్ కాకుండా ఉండడానికి రూపొందించారు. అయితే ఇప్పటికే ఫాస్ట్ట్యాగ్ ఉన్నవారు కొత్త ఫాస్ట్ట్యాగ్ కొనాల్సిన అవసరం లేదని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) స్పష్టం చేసింది.
FASTag ఏడాది పాస్ ఎలా పనిచేస్తుంది: ఈ ఫాస్ట్ ట్యాగ్ ఏడాది పాస్ NHAI నిర్వహించే జాతీయ రహదారులు (NH) ఇంకా జాతీయ ఎక్స్ప్రెస్వేలు (NE)లోని అన్ని టోల్ ప్లాజాలలో పనిచేస్తుంది. రాష్ట్ర రహదారులు లేదా మున్సిపల్ టోల్ రోడ్లపై కూడా మీ FASTag పనిచేస్తుంది అలాగే టోల్ ఛార్జీలు ఎప్పటిలాగే వర్తిస్తాయి. పాస్ వాలిడిటీ అయిపోయే వరకు ఏదైనా జాతీయ రహదారి లేదా ఎక్స్ప్రెస్వేపై ఇబ్బందులు లేకుండా ప్రయాణించొచ్చు. వాలిడిటీ ముగిసిన తర్వాత ప్రస్తుత ఫాస్ట్ట్యాగ్ సిస్టంలాగే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక ఏడాదిలోపు 200-ట్రిప్లు దాటితే పాస్ను మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫాస్ట్ ట్యాగ్ ఏడాది పాస్ ఎలా తీసుకోవాలి : FASTag ఏడాది పాస్ అనేది డిజిటల్ గా తీసుకోవచ్చు. దీని కోసం ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే
*మొదట Rajmarg Yatra యాప్ను డౌన్లోడ్ చేసుకోండి లేదా NHAI అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
*ఇప్పుడు మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలను ఎంటర్ చేయండి.
*మీ ప్రస్తుత FASTag యాక్టివ్గా, వాలిడిటీ ఉండేలా అలాగే బ్లాక్లిస్ట్ లేకుండా చూసుకోవాలి.
* ఇప్పుడు రూ. 3,000 ఛార్జ్ ఆన్లైన్ ద్వారా చెల్లించండి.
*చెల్లించిన తర్వాత, మీ ఏడాది పాస్ మీ ప్రస్తుత FASTagకి లింక్ అవుతుంది.