- జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
మల్కాజ్ గిరి, వెలుగు: సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్చేస్తున్న ‘1980 ఏఐ ట్రెండ్' పేరుతో సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఆ తరం స్టైల్లో మన ఫొటోలను చూసుకోవాలనే ఆశతో గుర్తు తెలియని యాప్స్ను డౌన్లోడ్చేసుకుంటే ఫోన్ హ్యాక్చేసి కొల్లగొడుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏపీకే ఫైల్స్కూడా పంపించి కష్టార్జితాన్ని మాయం చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ఇస్తున్నారు.
ఏఐ టూల్స్ సాయంతో మన ఫొటోలను 1980ల నాటి రెట్రో లుక్లోకి మార్చుకోవడం ఇప్పుడు నెట్టింట పెద్ద క్రేజ్గా మారింది. చాట్ జీపీటీ లాంటి యాప్లలో ఉచిత వాడకానికి పరిమితులు ఉండటంతో, చాలామంది యూజర్లు ప్రత్యామ్నాయ యాప్లవైపు చూస్తున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ‘1980s AI Trend’ పేరుతో నకిలీ యాప్స్, ఏపీకే ఫైల్స్ను తయారు చేసి, థర్డ్ పార్టీ వెబ్సైట్స్, సోషల్ మీడియా లింక్లు, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పంపిస్తున్నారు. క్షణాల్లో రెట్రో ఫొటోలు ఇచ్చేస్తామంటూ యూజర్లను ఆకర్షిస్తున్నారు.
ప్రమాదం ఇలా..
ఈ నకిలీ ఏపీకే ఫైల్ డౌన్లోడ్చేసి ఇన్స్టాల్చేయగానే..ఫోన్లోని గ్యాలరీ, కాంటాక్ట్స్, ప్రైవేట్ ఫొటోలు హ్యాకర్ల చేతికి చిక్కుతాయి. ఈ మాల్వేర్ ద్వారా ఫోన్పై నిఘా పెట్టి, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలను కాజేస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలను ఆసరాగా చేసుకుని బెదిరింపులకు దిగే ప్రమాదం కూడా ఉందని పోలీసులు అంటున్నారు.
ట్రెండ్ ఏదైనా సరే, గుర్తు తెలియని లింక్ల నుంచి ఏపీకే ఫైల్స్డౌన్లోడ్చేయవద్దని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక యాప్ స్టోర్లలో లభించే నమ్మకమైన యాప్లనే వాడాలని కోరుతున్నారు.
