గచ్చిబౌలి, వెలుగు: సీబీఐ అధికారులమని నమ్మించి డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ పాస్టర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.31.61 లక్షలు కాజేశారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ రాఘవేంద్రకాలనీకి చెందిన పాస్టర్(73)కు గత నెల 24న ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ముంబైలోని టెలికాం డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ఓ మహిళను వేధించావని చెప్పి అసభ్యకరమైన ఫొటోలు పంపించాడు.
తరువాత రోజు ఫోన్ చేసి తాను సీబీఐ ఆఫీసర్ను మాట్లాడుతున్నానని చెప్పి ముంబైలోని నరేశ్గోయల్ అనే వ్యక్తి ఇంటిపై రైడ్ చేస్తే 229 డెబిట్కార్డులు దొరికాయని, అందులో నీ కార్డు ఉందని పాస్టర్కు చెప్పాడు. కెనరా బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.5లక్షలు మనీ ల్యాండరింగ్ జరిగిందని భయభ్రాంతులకు గురి చేశాడు. విచారణ కోసం ముంబైలోని సీబీఐ ఆఫీస్కు రావాలని సూచించాడు.
అనారోగ్య కారణాలతో తాను రాలేనని చెప్పడంతో డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా విచారణ చేస్తామని చెప్పి, బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు బదిలీ చేయాలని, వెరిఫికేషన్ పూర్తయ్యాక తిరిగి పంపిస్తామని నమ్మించారు. రసీదు కూడా ఇస్తామని చెప్పడంతో పాస్టర్ తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.31.61 లక్షలు సదరు వ్యక్తులు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తరువాత డబ్బులు పంపకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఏసీబీ రైడ్ పేరుతో ఆర్ అండ్ బీ ఈఈకి టోకరా..
ఏసీబీ అధికారి అని బెదిరించి ఆర్అండ్బీ ఈఈ నుంచి సైబర్ నేరస్తుడు రూ.10 లక్షలు కొట్టేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొంపల్లికి చెందిన ఈఈకి గత నెల 15న ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఏసీబీ ఆఫీస్ నుంచి నరేందర్రెడ్డి మాట్లాడుతున్నానని, అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదు వచ్చిందని రైడ్ చేస్తారని భయభ్రాంతులకు గురి చేశాడు.
రైడ్ చేయకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు డబ్బు పంపించాలనడంతో సదరు అధికారి భయపడి తనతో పాటు తన ఫ్రెండ్స్ అకౌంట్ల నుంచి జులై 15 నుంచి ఈ నెల 2 వరకు 25 సార్లు సైబర్ నేరగాడు సూచించిన నంబర్లకు రూ.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. మరింత డబ్బు పంపాలని డిమాండ్ చేయడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
