హైదరాబాద్ ఉప్పల్లోని సరస్వతి నగర్ సైడ్ ఉండేటోళ్లకు ఈ ముచ్చట తెలుసా..?

హైదరాబాద్ ఉప్పల్లోని సరస్వతి నగర్ సైడ్ ఉండేటోళ్లకు ఈ ముచ్చట తెలుసా..?

ఎల్బీనగర్, వెలుగు: సీబీఐ పేరుతో ఓ రిటైర్డ్ సైంటిస్ట్ నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.1.34 కోట్లు కొట్టేశారు. బెంగళూరులో హ్యుమన్ ట్రాఫికింగ్ కింద కేసు రిజిస్టర్ అయిందని వీడియో కాల్ ద్వారా బెదిరించి అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చేశారు. చివరికి మోసపోయానని గ్రహించిన సదరు బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ నాగలక్ష్మి మంగళవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ ఉప్పల్లోని సరస్వతి నగర్​కు చెందిన 74 ఏండ్ల సివేంద్ర నాథ్ రాయ్.. సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్​గా పనిచేసి రిటైర్ అయ్యారు. మే 31న సివేంద్రనాథ్ ఇంట్లో ఉన్నప్పుడు ఓ వీడియో కాల్ వచ్చింది.

‘‘మేము సీబీఐ నుంచి మాట్లాడుతున్నాం. మీపైన బెంగళూరులో హ్యుమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయి. చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ కేసు ఇప్పుడు సీబీఐకి వచ్చింది. కేసు విషయాలు డిస్కస్ చేయడానికి మా ఆఫీసర్ మీతో మాట్లాడుతారు’’అని ఎదుటి వ్యక్తి చెప్పాడు. బ్యాక్​గ్రౌండ్​లో సీబీఐ లోగోతో ఉన్న రూమ్​లో పోలీస్ యూనిఫార్మ్ వేసుకుని ఓ వ్యక్తి కూర్చున్నాడు. సీబీఐ ఆఫీసర్ సందీప్ రాయ్​గా పరిచయం చేసుకున్నాడు.

‘‘మీరు ఇండియా నుంచి విదేశాలకు అమ్మాయిలను తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. ఇది పెద్ద హ్యుమన్ ట్రాఫికింగ్ కేసు. మీపైన ఎంక్వైరీ మొదలైంది. ఈ బిజినెస్​లో జరిగిన ట్రాన్సాక్షన్లకు సంబంధించిన డేటా మొత్తం మా దగ్గర ఉంది. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నది. అరెస్ట్ కాకుండా ఉండాలంటే.. మీ అకౌంట్​లో ఉన్న డబ్బు మొత్తం ట్రాన్స్​ఫర్ చేయాలి. కేసు విచారణ తర్వాత తప్పు చేయలేదని తేలితే.. మీరు పంపిన డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తాయి’’అని సైబర్ కేటుగాడు అన్నాడు.

దీంతో భయపడిపోయిన సివేంద్రనాథ్ రాయ్.. ఈ నెల 2, 3వ తేదీల్లో పలు దఫాలుగా వాళ్లిచ్చిన అకౌంట్ నంబర్​కు రూ.1.34 కోట్లు ట్రాన్స్​ఫర్ చేశాడు. కేసు అప్డేట్ తెలుసుకునేందుకు కాల్ చేస్తే కలవలేదు. చివరికి మోసపోయానని గ్రహించి 6వ తేదీన ఎల్బీనగర్​లోని రాచకొండ సైబర్ క్రైమ్​లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ నాగలక్ష్మి తెలిపారు. డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు గోల్డెన్ అవర్స్​లో ఫిర్యాదు చేస్తే రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే న్యాయం జరుగుతుందని వివరించారు.