హైదరాబాద్,వెలుగు: ఫేక్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి సైబర్ మోసగాళ్లు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం నిరుద్యోగ యువతను ట్రాప్ చేసి టెలీకాలర్స్ గా రిక్రూట్ చేసుకుంటున్నారు. హిందీ, ఇంగ్లీష్ బాగా మాట్లాడితే చాలు ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండానే టెలీ కాలర్ గా జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఎంఎన్ సీ కంపెనీల మధ్య కార్పొరేట్ తరహా ఆఫీసులను ఓపెన్ చేసి యువతను అట్రాక్ట్ చేస్తున్నారు. బ్యాంకులకు థర్డ్ పార్టీ కస్టమర్ కేర్ సెంటర్ లో టెలీ కాలర్ గా జాబ్ అని నమ్మించి యువతను రిక్రూట్ చేసుకుంటున్నారు. డార్క్ వెబ్ సైట్స్, ఏజెన్సీల నుంచి కొని ఫోన్ నంబర్స్ డేటా బేస్తో సైబర్ నేరాలకు ప్లాన్ చేస్తున్నారు. యూపీ,నోయిడా కేంద్రంగా ఇలాంటి ఫేక్ కాల్ సెంటర్స్ భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు సిటీ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా 15 రోజుల కిందట ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని కాల్సెంటర్పై దాడులు చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. ఫేక్ కాల్ సెంటర్ ఆపరేటర్స్, టెలీకాలర్స్ నుంచి వివరాలు రాబడుతున్నారు.
అమ్మాయిలతో కాల్స్ చేయించి..
బ్యాంక్ ఫ్రాడ్స్, లోన్ యాప్స్, ఇన్వెస్ట్ మెంట్, ఇతర జాబ్ ఫ్రాడ్ సహా ఆన్లైన్ మోసాల్లో ఫేక్ కాల్సెంటర్స్ కీలకంగా పనిచేస్తున్నాయి. సాఫ్ట్వేర్ జీతం కంటే ఎక్కువ కమీషన్ పేరుతో ఇస్తామంటూ సైబర్ క్రిమినల్స్ యువతను ట్రాప్ చేస్తున్నారు. టెలీకాలర్స్ కింద అమ్మాయిలనే ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నారు. వీరిలో హిందీ,ఇంగ్లీష్ మాట్లాడే వారికి ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారు. ఇతరులను నమ్మించే విధంగా ఎలా మాట్లాడాలో వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. డార్క్ వెబ్ సైట్, ఏజెన్సీల నుంచి కొన్న ఫోన్ నంబర్లను టెలీ కాలర్స్ కు ఇచ్చి కాల్ చేయిస్తున్నారు. క్రెడిట్ కార్డ, పర్సనల్ లోన్, ఇన్వె స్ట్ మెంట్ అంటూ నమ్మింపజేసి ఫ్రాడ్ చేయిస్తున్నారు. ఇందులో ఢిల్లీ, నోయిడా, బెంగళూర్, వెస్ట్ బెంగాల్ లో ఎక్కువగా ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్లో(కొన్ని రోజుల పాటు మాత్రమే నడిచే విధంగా) కాల్సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫేక్ అడ్రెస్ తో సిమ్ కార్డులు,బ్యాంకు అకౌంట్స్ క్రియేట్ చేసి వరుస మోసాలకు పాల్పడుతున్నారు.
టార్గెట్ రీచ్ అయితే కమీషన్లు, గిఫ్ట్ లు
కాల్ సెంటర్ అంతా సీసీ కెమెరాలు వాయిస్ రికార్డర్స్ను ఫిక్స్ చేస్తున్నట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరించారు. టెలీకాలర్స్ యాక్టివిటీని గమనించేందుకు మేనేజర్లు,సూపర్వైజర్లు ఉంటారు. ఒక్కో టెలీకాలర్ రోజుకు సుమారు 100 కాల్స్ చేయాలి. అందులో కనీసం 80 శాతం కాల్స్ నుంచి తమకు కావల్సిన సమాచారం రాబట్టాలి. ఇలాంటి టార్గెట్ రీచ్ అయిన టెలీకాలర్స్ కు సైబర్ క్రిమినల్స్ కమీషన్స్,గిఫ్ట్స్ల ఆశ చూపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టెలీకాలర్స్ కు జీతాలను బ్యాంకుల నుంచి కాకుండా క్యాష్ రూపంలో చెల్లిస్తున్నట్లు తెలుసుకున్నారు. సైబర్ మోసాలకు పాల్పడి కలెక్ట్ చేసిన క్యాష్ ను డిపాజిట్ చేసేందుకు టెలీకాలర్స్ బంధువులు,ఫ్రెండ్స్ అకౌంట్లను సేకరిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం ప్రతి నెల వారికి కమీషన్ చెల్లిస్తున్నట్లు గుర్తించారు.
హిందీలో మాట్లాడుతూ..
సైబర్ క్రిమినల్స్ ఇలాంటి ఫేక్ కాల్ సెంటర్లతో దేశవ్యాప్తంగా అన్ని భాషల వారిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందీ ఎక్కువగా మాట్లాడే నార్త్ ఇండియాకు చెందిన వారితో పాటు హైదరాబాదీలకు ఎక్కువ కాల్స్ చేస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూర్,చెన్నైలాంటి మెట్రో సిటీలను టార్గెట్ చేసేందుకు స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడే వారికి టెలీకాలర్స్గా రిక్రూట్ చేసుకుంటున్నారు. పోలీసులు దాడులు చేసినప్పుడు టెలీకాలర్స్ తప్ప ఆర్గనైజర్స్ పట్టుపడకుంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో మేనేజర్, టీమ్ లీడర్స్, టెలీకాలర్స్ను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కొన్ని కేసుల్లో టెలీకాలర్స్కి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. చీటింగ్లో వారి ప్రమేయం ఉందని తెలితే అరెస్ట్ చేస్తున్నారు.
జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలె
లోన్ యాప్స్ కేసు దర్యాప్తులో భాగంగా కొంతకాలంగా ఫేక్ కాల్ సెంటర్లపై దాడులు చేస్తున్నాం. అందులో ఎంప్లాయీస్ తప్ప ఆర్గనైజర్స్ దొరికేవారు కాదు. కాల్ సెంటర్లో జరిగే సైబర్ నేరాల గురించి టెలీకాలర్స్కు తెలియదు. ఐడీ కార్డుల దగ్గరి నుంచి అపాయింట్మెంట్ లెటర్ వరకు అన్నీ ఒరిజినల్ గా కనిపిస్తాయి. ఇలాంటి కాల్ సెంటర్స్తో దేశవ్యాప్తంగా మోసాలు జరుగుతున్నాయి. టెలీకాలర్ గా జాబ్ చేయాలనుకు నేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ కాల్ సెంటర్ అని అనిపిస్తే స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ లో సమాచారం ఇవ్వాలి.
- కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్