బషీర్బాగ్, వెలుగు: ప్రీ-ఐపీఓ పెట్టుబడి పేరిట ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. మలక్పేటకు చెందిన 60 ఏండ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఇటీవల ఫేస్బుక్లో ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ పేరుతో వచ్చిన ప్రకటన లింక్ను ఓపెన్ చేశారు. అనంతరం వాట్సాప్ ద్వారా అతనిని స్కామర్లు సంప్రదించారు.
తనను ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ ప్రతినిధి గోషన్ యాదవ్ గా పరిచయం చేసుకుంటూ లాభదాయకమైన పెట్టుబడులు, ఐపీవో కేటాయింపులు అందిస్తామని నమ్మించారు. బాధితుడిని “ఐఐఎఫ్ఎల్ సీఎస్ ప్రీ–ఐపీఓ 067” అనే వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఆ గ్రూప్లో నిత్యం లాభాలు, షేర్ కేటాయింపుల నకిలీ స్క్రీన్షాట్లు పెట్టారు.
వీటిని నమ్మిన బాధితుడు మొదట రూ.8,000 పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత మొత్తం ₹51.23 లక్షల వరకు బదిలీ చేశాడు. స్కామర్స్ తమ నకిలీ వెబ్సైట్లో గ్రో, టెన్నిండ్ షేర్ల కేటాయింపులు జరిగాయని చూపిస్తూ, అతని పెట్టుబడిని రూ.1.30 కోట్లుగా పెరిగాయని చూపెట్టారు. ఆ నిధులను విత్ డ్రా చేయాలంటే టాక్స్ గా రూ.51.23 లక్షలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
