- గోల్డెన్ అవర్స్లో కాల్ కలవట్లేదని బాధితుల ఆవేదన
హైదరాబాద్, వెలుగు: ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్తో వాట్సాప్ హ్యాకింగ్, ఓటీపీ మోసాలు ఇలా రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కానీ, సైబర్ మోసం జరిగిన వెంటనే ఫోన్ చేయాల్సిన నేషనల్ హెల్ప్లైన్ నంబర్ 1930 ఎప్పుడు చూసినా బిజీగా ఉంటున్నది. దాంతో గోల్డెన్ అవర్స్లో కాల్ కలవట్లేదని సైబర్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు రోజుకు సగటున 3,000 సైబర్ మోసం కాల్స్ వస్తున్నాయి. ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల మధ్యే ఎక్కువ కాల్స్ వస్తుండగా..అరకొర సిబ్బంది వల్ల కాల్స్ అటెండ్ చేయడంలో ఆలస్యం జరుగుతున్నది.
కేవలం 42 మంది కాల్ టేకర్స్ తో నడుస్తున్న హెల్ప్డెస్క్కు కాల్ కనెక్ట్ అవ్వడానికే 3 నుంచి 15 నిమిషాలు పడుతున్నది. చాలాసార్లు “ఆల్ లైన్స్ బిజీ”అని కాల్ కట్ అవుతున్నదని బాధితులు వాపోతున్నారు. కొన్ని కాల్స్ రింగ్ అయినప్పటికి ఎవ్వరూ ఆన్సర్ చేయడం లేదని పేర్కొన్నారు. హెల్ప్డెస్క్ సిబ్బందిని పెంచి, గోల్డెన్ అవర్లో లైన్ ఖాళీ ఉండేలా చూడాలని కోరారు.
కీలక సమయంలోనే లైన్ బిజీ..
సైబర్ మోసం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్)లో 1930కు కాల్ చేస్తేనే డబ్బు ఫ్రీజ్ చేసి తిరిగి పొందే చాన్స్ ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటివరకు టీజీసీఎస్బీ(టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) కాల్ టేకర్స్ మొత్తం 3,92,525 కాల్స్ అటెండ్ చేశారు. రోజుకు 350కి పైగా కేసులు నమోదు చేశారు.
ఈ నెల 26 వరకు తెలంగాణకు చెందిన బాధితులు మొత్తం రూ.237.2 కోట్లు కోల్పోయారు. అయినా టీజీసీఎస్బీ కేసులను దర్యాప్తు చేసి బాధితులకు రూ.159.16 కోట్లు తిరిగి రిఫండ్ చేయగలిగింది. అయితే, 1930 బిజీ వచ్చినప్పుడు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో యొక్క ఆన్లైన్ చాట్బాట్ (www.cybercrime.gov.in లేదా tscybersecurity.telangana.gov.in) ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
