
ముంబై: ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ సైయెంట్ డీఎల్ఎం 51 శాతం ప్రీమియంతో మార్కెట్లో లిస్ట్ అయ్యింది. ఇష్యూ ధర రూ.265 కాగా, కంపెనీ షేర్లు రూ.401 దగ్గర లిస్ట్ అయ్యాయి. మొదటి రోజుని 59 శాతం లాభంతో రూ.421 దగ్గర ముగించాయి. ఫండమెంటల్స్ బాగుండడం, రూ.2,432.5 కోట్ల విలువైన ఆర్డర్ బుక్ ఉండడం, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనుకూలమైన పాలసీలను తెస్తుండడంతో సైయెంట్ డీఎల్ఎం షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.592 కోట్లను సేకరించగా, ఐపీఓ ఏకంగా 67 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. కిందటి నెల 27 నుంచి 30 వరకు ఐపీఓ అందుబాటులో ఉంది. క్వాలిఫైయిడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 90 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 49.22 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది.
మార్కెట్ పాజిటివ్గా...
బెంచ్మార్క్ ఇండెక్స్లు సోమవారం సెషన్ను కొద్ది పాటి లాభాలతో ముగించాయి. బ్యాంక్, ఐటీ షేర్లు ఇండెక్స్లను కిందకి లాగినప్పటికీ, రిలయన్స్ ర్యాలీతో పాజిటివ్గా ముగియగలిగాయి. సెన్సెక్స్ 64 పాయింట్లు లాభపడి 65,344 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 19,356 దగ్గర క్లోజయ్యాయి. గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా కదిలిన వేళ, బెంచ్మార్క్ ఇండెక్స్లు సోమవారం సెషన్ను లాభాలతో ఓపెన్ చేశాయి. ఇంట్రాడేలో మరింత పెరిగి, చివరికి కొంత ప్రాఫిట్ కోల్పోయి ముగిశాయి.