- వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డి.రవీంద్ర నాయక్
గ్రేటర్ వరంగల్, వెలుగు : వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ డి.రవీంద్ర నాయక్ ఆదేశించారు. వరంగల్, హనుమకొండ డీఎంహెచ్వో ఎ.అప్పయ్య, బి.సాంబశివరావుతో కలిసి ఆదివారం వరంగల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అమరావతి నగర్లో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ను సందర్శించారు.
ఈ సందర్భంగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే వివరాలు, హెల్త్ క్యాంప్, రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. నీరు నిల్వ ఉండడం, ఆహార పదార్థాలు కలుషితం కావడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని, ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ఎవరైనా అనారోగ్యానికి గురైతే ట్రీట్మెంట్ చేస్తూ పీహెచ్సీకి రెఫర్ చేయాలని సూచించారు.
ఆయన వెంట అడిషనల్ డీఎంహెచ్వో టి.మదన్మోహన్రావు, మాలిక, రాజారెడ్డి, టీబీ నియంత్రణాధికారి హిమబిందు, ప్రోగ్రాం ఆఫీసర్లు ఇక్తదార్ అహ్మద్, జ్ఞానేశ్వర్, మంజుల, మాస్ మీడియా జిల్లా అధికారి అశోక్రెడ్డి, వరంగల్ డిప్యూటీ డీఎంహెచ్వోలు ప్రకాశ్, కొమురయ్య పాల్గొన్నారు.
