టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరో డీఏ ఇవ్వాలని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. జూన్ నెల వేతనంతో కలిపి డీఏ చెల్లించనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటించారు. జులై 2022 లో ఇవ్వాల్సిన 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. జూన్ నెల కలిపి ఈ డీఏ ఉద్యోగుల ఖాతాలో వేయనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరవలేనిది. ముఖ్యంగా 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక తెలంగాణ కోసం ఆర్టీసీ ఉద్యోగులు పోరాడారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది. మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.