వేల లీటర్ల పాలు పారబోశారు

వేల లీటర్ల పాలు పారబోశారు

అధికారుల తీరుకు ఒడిశా పాడి రైతుల నిరసన

పాలల్లో కల్తీ జరిగిందని ఒడిశా స్టేట్​కో ఆపరేటివ్​మిల్క్​ప్రొడ్యూసర్స్​ఫెడరేషన్(ఓంఫెడ్) అధికారులు తిరస్కరించడంతో రైతులు పాలను పారబోశారు. అధికారుల తీరును నిరసిస్తూ పదుల సంఖ్యలో రైతులు దాదాపు 2 వేల లీటర్లకు పైగా పాలను రోడ్డుమీద కుమ్మరించారు. భద్రక్​జిల్లాలోని బసుదేవ్​పూర్​లో శనివారం పాడి రైతులు ఆందోళన చేశారు. ఎప్పట్లానే కేంద్రానికి పాలు తీసుకొచ్చామని, అయితే పాల నాణ్యత బాలేదంటూ అధికారులు తిరస్కరించారని రైతులు చెప్పారు. గత్యంతరంలేక తీసుకొచ్చిన పాలను రోడ్డు మీద పారబోశామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం పూట కూడా పాలను తీసుకోలేదని వారు వివరించారు. అయితే, రైతులు పాలను కల్తీ చేసి తీసుకువస్తున్నారని ఓంఫెడ్​ఎండీ విశాల్​గగన్​చెప్పారు. పాలల్లో చక్కెర కలిపి తీసుకొస్తున్నారని కొంతకాలంగా ఫిర్యాదులు అందాయని చెప్పారు. పరీక్షల్లో పాలల్లో కల్తీ జరిగిందని తేలడం వల్లే తిరస్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు. బసుదేవ్​పూర్​ఘటనపై విచారణ జరిపించనున్నట్లు గగన్​చెప్పారు.