
- సంపద పెంచుకున్న బిలియనీర్ దమానీ
- డీమార్ట్ బిజినెస్ పెరగడమే కారణం
ముంబై: కరోనా వైరస్ వేగం విస్తరిస్తుండటం.. 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రోజు కూలి నుంచి అపర కుబేరుల వరకూ అంతా తమ ఆదాయాన్ని, సంపదను కోల్పోయారు. ఒకరు మాత్రం లాక్ డౌన్ టైమ్ లోనూ తన వెల్త్ పెంచుకున్నారు. ఆయనే డీ మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ. ఈ ఏడాది ఆయన సంపద 5 శాతం పెరిగి 10.2 బిలియన్ డాలర్లకు చేరింది. 12 మంది రిచ్చెస్ట్ ఇండియన్స్ లో లాక్ డౌన్ టైమ్ లో సంపద పెంచుకున్న ఏకైక వ్యక్తి దమానీనే. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది.
5 శాతం పెరిగిన సంపద
ఫిబ్రవరిలో ముకేశ్ అంబానీ తర్వాత దేశంలో సెకండ్ రిచ్చెస్ట్ బిలియనీర్ గా దమానీ నిలిచారు. ఆయన మొత్తం సంపదలో ఎక్కువ భాగం ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ షేర్లే ఉన్నాయి. ఈ ఏడాది ఈ షేర్ల విలువ 18 శాతం పెరిగింది. ముంబైలోని సింగిల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ నుంచి తన ప్రస్థానం ప్రారంభించిన దమానీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియా రిచ్చెస్ట్ బిలియనీర్లలో ఒక్కరిగా నిలిచారు. లాక్ డౌన్ టైమ్ లో దమానీ సంపద 5 శాతం పెరిగితే.. ఇదే సమయంలో ముఖేష్ అంబానీ, ఉదయ్ కోటక్ లాంటి వారి సంపద 32 శాతం తరిగిపోయింది.
డీమార్ట్ కు మస్తు గిరాకీ
లోకాస్ట్ మోడల్ తో నడుస్తున్న డీ మార్ట్ స్టోర్లకు ప్రస్తుతం మస్తు గిరాకీ ఉంది. లాక్ డౌన్ టైమ్ లోనూ డీ మార్ట్ సూపర్ మార్కెట్లకు ఏ మాత్రం డిమాండ్ తగ్గకపోవడం.. నిత్యావసర వస్తువులకు జనం ఎక్కువగా వీటిపైనే ఆధారపడటం దమానీకి కలిసి వచ్చింది. ఒకటిరెండు నెలలకు సరిపడా సరుకులు, బియ్యం లాంటివన్నీ జనం కొని పెట్టుకోవడం కూడా దీనికి ఒక కారణం. ఇవన్నీ కలిసి కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్ లో డీ మార్ట్ షేరు పరుగులు పెట్టింది. ఆ షేరు కొన్ని రోజులుగా పెరుగుతూనే వచ్చింది. డీ మార్ట్ కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో బ్రాంచ్ లు ఉన్నాయి. కరోనా నివారణ కోసం దమానీ పీఎం కేర్స్ ఫండ్ కి రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు.