- మెడికల్ కౌన్సిల్లో ఫేక్ రిజిస్ట్రేషన్ల దందా
- కౌన్సిల్ సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు డాక్టర్ల అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: మెడికల్ కౌన్సిల్ లో ఫేక్ రిజిస్ట్రేషన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఫ్యాబ్రికేటెడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న కౌన్సిల్ సీనియర్ అసిస్టెంట్ కందుకూరి అనంతకుమార్ (47), డాక్టర్లు శివానంద్ (32), దిలీప్ కుమార్ లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఫేక్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నారు. నాలుగేండ్లుగా సాగుతున్న రిజిస్ట్రేషన్ల గోల్మాల్ వివరాలను జాయింట్ సీపీ ఏఆర్.శ్రీనివాస్ వెల్లడించారు.
ఇలా దొరికారు..
మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అయిన ఓల్డ్ నంబర్స్ తో అనంతకుమార్ ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికెట్స్ తయారు చేశాడు. స్క్రీనింగ్ టెస్ట్లో ఫెయిల్ అయిన వారి ఫొటోస్, కంప్లీట్ డీటెయిల్స్ తో ఒక్కో సర్టిఫికెట్ కి రూ.9 లక్షలు వసూలు చేశాడు. శివానంద్, దిలీప్ కుమార్తో పాటు ఏపీకి చెందిన డాక్టర్లు నాగమణి, శ్రీనివాస్ కూడా ఫ్యాబ్రికేటెడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ సేల్ చేశారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన సిద్ద అమ్రిషమ్ రెడ్డి తన పీజీ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చాడు. కౌన్సిల్ డేటాలో అప్లోడ్ చేసేందుకు ప్రయత్నించాడు. తన ఎంబీబీఎస్ రిజిస్ర్టేషన్ నంబర్తో శివానంద్ పేరును గుర్తించాడు. కౌన్సిల్ రిజిస్ర్టార్ హనుమంతరావుకి కంప్లైంట్ చేశాడు. దీంతో అలర్టైన రిజిస్ర్టార్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రిజిస్టార్ అందించిన సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. అనంతకుమార్తో పాటు శివానంద్, దిలీప్ కుమార్ లను అరెస్ట్ చేశారు.
స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై కాలేక..
విదేశాల్లో మెడిసిన్ చదివిన విద్యార్థులు ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ రాయాలి. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఆయా రాష్ట్రాల నుంచి మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం 2012 నుంచి 2014 వరకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ స్క్రీనింగ్ టెస్ట్లు రాశారు. కానీ అందులో క్వాలిఫై కాలేదు. దీంతో స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కోసం అర్హత సాధించ లేకపోయారు. ఇండియాలో ప్రాక్టీస్ చేసేందుకు మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ఫేక్ సర్టిఫికెట్ కోసం సెర్చ్ చేశారు. 2017లో అనంతకుమార్ ను కలిశారు.
