కాగజ్ నగర్, వెలుగు : టిప్పర్ వెళ్తుంటే అనుకోకుండా ఓ కోడిపెట్ట అడ్డం వచ్చి టైర్ కింద పడి చనిపోయింది. దీంతో ఊరోళ్లంతా కలిసి ప్రమాదానికి కారణమైన లారీతో పాటు వెనుక వస్తున్న15 వాహనాలను అడ్డుకున్నారు. గుడ్ల మీది కోడిపెట్టను చంపినందుకు జరిమానా కట్టాల్సిందేనని పట్టుబట్టారు. ఈ ఘటన కుమ్రం భీం జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగింది. పోచమ్మ నుంచి బాబాసాగర్పోయే దారిలో ఉండే దంద్రే బండయ్య కోళ్లను పెంచుతున్నాడు. ఇతడి దగ్గరున్న ఓ కోడిపెట్ట రోడ్డుపైకి వెళ్లగా అటుగా వెళ్తున్న ఒక కంకర టిప్పర్ కోడిపై నుంచి వెళ్లింది. అది చనిపోగా ఓనర్తో పాటు 100 మంది గ్రామస్తులు గుమిగూడి ప్రమాదానికి కారణమైన లారీని ఆపారు. రూ.500 తీసుకుని వదిలిపెట్టాలని టిప్పర్ యజమాని కోరగా ఒప్పుకోలేదు.
తన కోడిపెట్ట ఇప్పటికే 10 గుడ్లు పెట్టిందని, అవి పిల్లలయితే తనకు ఎంతో లాభం వచ్చేదని కోడి ఓనర్ బండయ్య వాదించాడు. ఈ క్రమంలో టిప్పర్వెనక మరో 15 వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్సమస్య తలెత్తింది. రెండు గంటల తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని టిప్పర్యజమానితో మాట్లాడి కోడి ఓనర్కు రూ.5 వేలు ఇప్పించారు. అలాగే కంకర టిప్పర్ల వల్ల కంకర, చిప్స్ పడి దుమ్ము వస్తోందని గ్రామస్థులనడంతో.. లారీ డ్రైవర్లు మనుషులను పెట్టి రోడ్లను క్లీన్ చేయించారు. తర్వాతే లారీలను పోనిచ్చారు.