
- రామగుండం బల్దియాలో ప్రమాదకరంగా కల్వర్టులు, బ్రిడ్జిలు
- రిపేర్లు చేయకపోవడంతో కూలుతున్న కాలువల గోడలు
- పట్టించుకోని మున్సిపల్ యంత్రాంగం
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో డ్రైనేజీ, వరద కాల్వలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో డ్రైనేజీ, వరద నీరంతా బయటకు వస్తోంది. దీంతోపాటు కాల్వల మీద నిర్మించిన కల్వర్టులు, బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారాయి. ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. డ్రైనేజీ, వరద కాల్వల నిర్వహణను మున్సిపల్ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
చాలా ఏరియాల్లో కూలిన కాల్వలు
రామగుండం కార్పొరేషన్ పరిధిలో చాలా ఏరియాల్లో డ్రైనేజీ, వరద కాల్వలు కూలిపోయాయి. కాల్వల గోడలు కూలిపోయి బండరాళ్లు మధ్యలో పడిపోవడంతో వరద నీటిలో కొట్టుకొచ్చిన మట్టి, చెత్త పోగై ప్రవాహానికి అడ్డం పడుతున్నాయి. జవహర్నగర్ నుంచి ఎల్బీనగర్మీదుగా కూరగాయల మార్కెట్కు వెళ్లే ప్రధాన కాలువ చాలాచోట్ల కూలిపోయింది. సీతానగర్ నుంచి మల్లికార్జున్నగర్కు వెళ్లే కాలువ పరిస్థితి ఇలాగే ఉంది. 7బీ కాలనీ నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకు, విఠల్నగర్నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకు వచ్చే కాలువలు కూడా డ్యామేజ్ అయ్యాయి. విఠల్నగర్ మీ సేవా సెంటర్వద్ద ఏకంగా కల్వర్టు పగుళ్లు తేలి కనిపిస్తోంది.
పూడిక తీయకపోవడంతోనే సమస్య
రామగుండం కార్పొరేషన్లో శానిటేషన్ విభాగం పరిధిలో పలు రకాల మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ పూడిక తీయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల కాల్వల్లో చెత్త పేరుకుపోయి కనిపిస్తున్నది. గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లే దారిలో మాతంగి కాంప్లెక్స్కు ఎదురుగా ఉన్న కాల్వలో పూడిక తీయకపోవడంతో వర్షం కురిసినప్పుడల్లా వరద నీరు రోడ్డుపైకి చేరుతూ వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కూరగాయల మార్కెట్పక్కనున్న మెయిన్ కాల్వ కూడా రెండు వైపులా కూలిపోగా, ఇటీవలే దానిని నిర్మించారు.
యాక్షన్ ప్లాన్ నిల్
రామగుండం బల్దియాలో కొత్తగా డ్రైనేజీ, వరద కాల్వల నిర్మాణం, రిపేర్లు చేయడంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలుచేయడం లేదు. పెద్ద కాల్వల గురించి శ్రద్ధ లేకపోగా.. చిన్న కాల్వల గురించి అసలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. బల్దియా పరిధిలో డివిజన్లకు వార్డు ఆఫీసర్లను నియమించాక శానిటేషన్ విభాగం ఆఫీసర్లు అసలు దృష్టి పెట్టడం లేదు. అంతా వార్డు ఆఫీసర్లే చూసుకుంటారని చెబుతుండగా.. వారికి శానిటేషన్పై అసలు అవగాహన ఉండడం లేదు. దీంతో డ్రైనేజీ, వరద కాల్వల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వచ్చే చలికాలంలో దీనిపై యాక్షన్ ప్లాన్ చేపట్టకపోతే డ్రైనేజీ కాల్వలు మరింత కూలిపోయే ప్రమాదం ఉంది.