
దసరా పండుగను తెలుగు రాష్ట్రాలతో దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2025) ఈపండుగ (అక్టోబర్ 2) వతేదీన జరుపుకుంటున్నాము. ఈ రోజు (అక్టోబర్ 2) జమ్మి చెట్టును పూజిస్తే కష్టాలు తొలగి ప్రతి పనిలో కూడా విజయం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు ( అక్టోబర్ 2) ఏ సమయంలో పూజించాలి.. పూజా విధానం ఏమిటి మొదలగు విషయాలు తెలుసుకుందాం. . .
విజయ దశమి అంటేనే జమ్మి చెట్టుకు పూజ చేయాల్సిన రోజు అని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే జమ్మిచెట్టుకు వృక్షాలలో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. జమ్మి చెట్టును అపరాజితా దేవి (రాజరాజేశ్వరి దేవి) స్వరూపంగా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అమ్మవారి స్వరూపంగా జమ్మిచెట్టును పురాణాలు వర్ణిస్తున్నాయి. దసరా రోజు జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజ చేయాలి.
జమ్మి పూజ శుభ ముహూర్తం
ఈ ఏడాది ( 2025) విజయదశమి రోజున ( అక్టోబర్ 2) విజయ ముహూర్తం మధ్యాహ్నం 2గంటల 9 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషాల మధ్యలో వచ్చిందని పండితులు తెలిపారు. ఈ 47 నిమిషాల పాటు ఈ విజయ ముహూర్తం ఉంటుంది. ఇది చాలా శక్తిమంతమైన సమయం. ఏడాదికి ఒకసారి వచ్చే సమయం. ఈ సమయంలో ఏ వ్యాపారం ప్రారంభించినా ఏడాది మొత్తం తిరుగులేని విధంగా వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్తగా ఒక పని ప్రారంభిస్తే విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది.
ఇలా పూజించాలి..
జమ్మిచెట్టు వద్ద మూడు తమలపాకులు ఉంచి.. ఆ మూడు తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలు ఉంచాలి. ఆ పసుపు ముద్దలకు పైభాగంలో ఎడమ వైపు.. కుడివైపు కుంకుమ బొట్లను పెట్టాలి. ఆ మూడు పసుపు ముద్దలను కూడా అమ్మవారి స్వరూపంగా భావించాలి. మధ్యలో ఉన్న పసుపు ముద్ద అపరాజితా దేవి, ఎడమవైపు.. అమ్మవారి అనుచరురాలు జయాదేవి, కుడివైపు విజయాదేవిగా భావించాలి. ఆ మూడు పసుపు ముద్దలకు కూడా జమ్మి చెట్టు కింద ఉంచి.. పసుపు కలిపిన అక్షింతలు వేస్తూ.. ఓం అపరాజితాదేవియే నమ:.. ఓం జయాదేవియేనమ:.. ఓం విజయాదేవియే నమ: అనే మంత్రాలను జపిస్తూ పూజ చేయాలి. ఆ పసుపు ముద్దల వద్ద బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఇలా చేయడం వల్ల సంవత్సరం అంతా అపరాజితా దేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.
అలా చేయలేని పక్షంలో.. మీ ఇంట్లోని సభ్యులందరి పేర్లు తెల్ల కాగితంపై
శమీ శమయతే పాపం
శమీ శతృ వినాశనం
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియ దర్శిని. ..
అనే పద్యాన్ని రాశి.. ఆ కాగితంపై మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు రాశి జమ్మిచెట్టు కొమ్మకు ఉంచాలి. ఆ తరువాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. అలా చేయడం వల్ల సంవత్సరం అంతా కుటుంబ సభ్యులపై అమ్మవారి సంపూర్ణ అగ్రహం కలుగుతుందని నమ్మకం. అయితే, జమ్మిచెట్టు వద్ద కాగితం పెట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో పై శ్లోకం అందరూ తప్పకుండా జపించాలి.ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం అమ్మవారు అపరాజితా దేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.