తెలంగాణ అప్పుల పాలైందని సీఎం రాష్ట్ర పరువు తీసిండు : దాసోజు శ్రవణ్

తెలంగాణ అప్పుల పాలైందని సీఎం రాష్ట్ర పరువు తీసిండు : దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అప్పుల పాలైందని ప్రధాని నరేంద్రమోదీ దగ్గర చెప్పి.. సీఎం రేవంత్​ రెడ్డి రాష్ట్రం పరువు తీశారని బీఆర్ఎస్ ​సీనియర్ ​నాయకుడు దాసోజు శ్రవణ్ ఫైర్​ అయ్యారు. డబ్బులు లేనప్పుడు దేశవ్యాప్తంగా మీడియాకు అడ్వర్టైజ్​మెంట్లు ఎందుకిచ్చారని ఆయన ప్రశ్నించారు. లంకె బిందెలున్నాయని వస్తే.. ఖాళీ బిందెలున్నాయని చెప్తున్న సీఎం.. డబ్బులు దుబారా ఎందుకు చేస్తున్నారని ఆయన అడిగారు. బుధవారం తెలంగాణ భవన్​లో శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని, డిసెంబర్​9వ తేదీనే రూ.4 వేల పింఛన్​ఇస్తామని చెప్పి ఇప్పుడు అప్లికేషన్​లు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రజలెవరూ కరెంట్​బిల్లులు కట్టొద్దని చెప్పారని.. అది ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. 

సీఎం హోదాలో ఉన్నా.. ప్రతిపక్ష నేత మాదిరిగానే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘సీఎం రేవంత్​భూమి మీద లేరు.. గాలిలో తేలియాడుతున్నారు”అని ఎద్దేవా చేశారు. పేమెంట్​కోటాలో పీసీసీ చీఫ్ అయిన రేవంత్​​రెడ్డి.. కేటీఆర్​ను పదే పదే మేనేజ్​మెంట్​కోటా అనడం సరికాదన్నారు. సెక్రటేరియెట్, ప్రగతి భవన్​దుబారాగా అనిపిస్తే సెక్రటేరియెట్​ను బీఆర్ అంబేద్కర్​హాస్పిటల్​గా, ప్రగతి భవన్​ను ఎడ్యుకేషనల్​హబ్​ లేదా హాస్పిటల్ గా మార్చాలని ఆయన డిమాండ్​చేశారు. పేయింటర్​అయిన రేవంత్​కు కోట్ల ఆస్తులు, జూబ్లీహిల్స్​లో ఇండ్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. సెక్రటేరియెట్​ను పరిపాలనకు వాడాలే తప్ప రాజకీయాల కోసం కాదని శ్రవణ్​పేర్కొన్నారు.