ముషీరాబాద్, వెలుగు : యాభై మంది బీసీ అభ్యర్థులను అసెంబ్లీకి పంపే వ్యూహంతో నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్కు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఓసీ వర్సెస్ బీసీలుగా ఉంటుందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన బీసీ రాజ్యాధికార సమితి ముఖ్య కార్యవర్గ ఎన్నికల కార్యాచరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను పథకాలకు పరిమితం చేసే రోజులు పోయి.. రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసేలా ప్రధాన పార్టీల్లో మార్పు తీసుకొచ్చామని చెప్పారు. అధికారంలోకి వస్తే బీసీ సీఎం అనే బీజేపీ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు.
బీసీల కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, రూ.లక్ష కోట్ల సబ్ ప్లాన్ తీసుకొచ్చి బీసీ కుల గణన చేస్తామని కాంగ్రెస్ చెప్పడం ఆహ్వానించదగ్గ పరిణామాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర మీడియా కన్వీనర్ మారేపల్లి లక్ష్మణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు దాసు బలరాం, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి, కార్యదర్శి గోశిక స్వప్న, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ప్యారసాని దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.