తొలి రోజు మనదే.. సుదర్శన్, జైశ్వాల్ హాస్ సెంచరీలతో ఇండియా స్కోరు 264/4

తొలి రోజు మనదే.. సుదర్శన్, జైశ్వాల్ హాస్ సెంచరీలతో ఇండియా స్కోరు 264/4

మాంచెస్టర్‌‌: ఇంగ్లండ్‌‌తో బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌‌లో ఇండియాకు మంచి ఆరంభం లభించింది. సాయి సుదర్శన్‌‌ (61), యశస్వి జైస్వాల్‌‌ (58) హాఫ్‌‌ సెంచరీలకు తోడు కేఎల్‌‌ రాహుల్‌‌ (46), రిషబ్‌‌ పంత్‌‌ (37 రిటైర్డ్‌‌హర్ట్‌‌) అండగా నిలవడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది. జడేజా (19 బ్యాటింగ్‌‌), శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (19 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌‌ కోసం ఇండియా మూడు మార్పులు చేసింది. ఫామ్‌‌లో లేని కరుణ్‌‌ నాయర్‌‌ను తప్పించి సాయి సుదర్శన్‌‌ను  తీసుకుంది. ఇక గాయపడిన ఆకాశ్‌‌ దీప్‌‌, నితీశ్‌‌ రెడ్డి ప్లేస్‌‌ల్లో అన్షుల్‌‌ కాంబోజ్‌‌ను అరంగేట్రం చేయించడంతో పాటు శార్దూల్‌‌ ఠాకూర్‌‌కు చాన్స్‌‌ ఇచ్చింది. 

తొలి సెషన్‌‌ నో వికెట్​..

ఓల్డ్‌‌ ట్రాఫోర్డ్‌‌ పిచ్‌‌పై ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఏ జట్టు ఇప్పటివరకు గెలవలేదు. కానీ మేఘావృతమైన వాతావరణ పరిస్థితుల్లో ఇంగ్లండ్‌‌ కెప్టెన్‌‌ టాస్‌‌ నెగ్గి అనూహ్యంగా బౌలింగ్‌‌ తీసుకున్నాడు. పిచ్‌‌పై బాల్‌‌ సీమ్‌‌ అయినా సరైన పేస్‌‌ లేకపోవడంతో ఈ సెషన్‌‌లో యశస్వి జైస్వాల్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌ పూర్తి ఆధిపత్యం చూపెట్టారు. స్టార్టింగ్‌‌లో పిచ్‌‌ పొడిగా ఉండటం, బాల్‌‌ నెమ్మదిగా రావడంతో క్రిస్‌‌ వోక్స్‌‌.. జైస్వాల్‌‌ను బాగా ఇబ్బందిపెట్టాడు. బాల్‌‌ను రెండు వైపులా  స్వింగ్‌‌ చేయడంతో డిఫెన్స్‌‌కు వెళ్లినా చాలాసార్లు బ్యాట్‌‌ అంచులను తాకుతూ వెళ్లాయి.

 వోక్స్‌‌ ఎనిమిది ఓవర్ల స్పెల్‌‌ను జైస్వాల్, రాహుల్‌‌ స్క్వేర్‌‌ కట్స్‌‌, డిఫెన్స్‌‌తో నిలువరించారు. 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌‌ ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. రెండో ఎండ్‌‌లో ఆర్చర్‌‌ బాల్స్‌‌ను జైస్వాల్‌‌ జాగ్రత్తగా గమనించి వదిలేశాడు. లార్డ్స్‌‌లో రెండుసార్లు అతని బౌలింగ్‌‌లోనే ఔట్‌‌కావడంతో ఆచితూచి ఆడాడు. వోక్స్‌‌ రౌండ్‌‌ ద వికెట్‌‌గా వేసిన స్పీడ్‌‌ బాల్‌‌ను బలంగా కొట్టే క్రమంలో జైస్వాల్‌‌ బ్యాట్‌‌ రెండు ముక్కలైంది. రెండో గంటలో మళ్లీ బౌలింగ్‌‌కు దిగిన ఆర్చర్‌‌ ఈసారి బౌన్సర్లతో దాడి చేశాడు. స్టోక్స్‌‌ షార్ట్‌‌ పిచ్‌‌లను జైస్వాల్‌‌ కట్‌‌ షాట్స్‌‌గా మలిచాడు. ఓవరాల్‌‌గా ఈ సెషన్‌‌లో 26 ఓవర్లు ఆడిన ఇండియా 78/0 స్కోరుతో లంచ్‌‌కు వెళ్లింది. 

గిల్‌‌ ఫెయిల్‌‌..

లంచ్‌‌ తర్వాత ఇండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సెషన్‌‌ నాలుగో ఓవర్‌‌లో రాహుల్‌‌ను వోక్స్‌‌ ఔట్‌‌ చేయడంతో తొలి వికెట్‌‌కు 94 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. నాయర్‌‌ ప్లేస్‌‌లో వచ్చిన సుదర్శన్‌‌ ఆకట్టుకున్నాడు. ఇంగ్లిష్ బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కొంటూ క్రీజులో నిలదొక్కుకున్నాడు. రెండో ఎండ్‌‌లో నిలకడగా ఆడిన జైస్వాల్‌‌ 96 బాల్స్‌‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 

ఇక ఫర్వాలేదనుకున్న దశలో 8 ఏళ్ల తర్వాత  టెస్ట్‌‌ మ్యాచ్‌‌ ఆడుతున్న స్పిన్నర్‌‌ డాసన్‌‌ ఇండియాను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్‌‌ 41వ ఓవర్‌‌లో డాసన్‌‌ వేసిన ఔట్‌‌సైడ్ ఆఫ్‌‌ స్టంప్‌‌ బాల్‌‌ను ఫుష్‌‌ చేసిన  జైస్వాల్‌‌ ఫస్ట్‌‌ స్లిప్‌‌లో బ్రూక్‌‌ చేతికి చిక్కాడు. రెండో వికెట్‌‌కు 26 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. భారీ అంచనాలతో వచ్చిన కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (12) ఫెయిలయ్యాడు.

 సుదర్శన్‌‌ డెడ్‌‌ డిఫెన్స్‌‌కు వెళ్లగా గిల్‌‌ రన్స్‌‌ కోసం యత్నించాడు. ఈ క్రమంలో స్టోక్స్‌‌ వేసిన గుడ్ లెంగ్త్‌‌ బాల్‌‌కు గిల్‌‌ ఎల్బీ అయ్యాడు. రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. మూడో వికెట్‌‌కు 20 రన్స్‌‌ జతయ్యాయి. స్టోక్స్‌‌ బౌలింగ్‌‌లో సుదర్శన్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను కీపర్‌‌ జెమీ స్మిత్‌‌ వదిలేశాడు. కొత్తగా వచ్చిన రిషబ్‌‌ పంత్‌‌... సుదర్శన్‌‌కు అండగా నిలిచాడు. స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ వికెట్‌‌ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సెషన్‌‌లో 26 ఓవర్లలో 71 రన్స్‌‌ రావడంతో స్కోరు 149/3కి చేరింది. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: 83 ఓవర్లలో 264/4 (సుదర్శన్‌‌ 61, జైస్వాల్‌‌ 58, స్టోక్స్‌‌ 2/47). 

192 ఏళ్ల టెస్ట్‌‌ క్రికెట్‌‌ చరిత్రలో 592 మ్యాచ్‌‌లు ఆడిన ఇండియా తొలిసారి తుది జట్టులో ఐదుగురు లెఫ్ట్​ హ్యాండర్స్​కు చోటు కల్పించింది. నాలుగో టెస్ట్‌‌లో జైస్వాల్‌‌, సాయి సుదర్శన్‌‌, పంత్‌‌, జడేజా, సుందర్‌‌తో బరిలోకి దిగింది. 

1 ఇంగ్లండ్‌‌లో వెయ్యి రన్స్‌‌ చేసిన తొలి విదేశీ వికెట్‌‌ కీపర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌. ధోనీ (778), రాడ్‌‌ మార్ష్‌‌ (773), జాన్‌‌ వైట్‌‌ (684), ఇయాన్‌‌ హీలీ (624) తర్వాతి ప్లేస్‌‌ల్లో ఉన్నారు. 

5ఇంగ్లండ్‌‌ గడ్డపై టెస్ట్‌‌ల్లో వెయ్యి రన్స్‌‌ పూర్తి చేసిన ఐదో ఇండియన్‌‌ బ్యాటర్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌. సచిన్‌‌ (1575), ద్రవిడ్‌‌ (1376), గావస్కర్‌‌ (1152), కోహ్లీ (1096) ముందున్నారు. ఈ ఫీట్‌‌ సాధించిన రెండో ఓపెనర్‌‌గానూ రికార్డులకెక్కాడు. 

పంత్‌‌కు ఏమైంది..?

మూడో సెషన్‌‌లో పంత్‌‌, సుదర్శన్‌‌ మరింత నెమ్మదిగా ఆడారు. ఈ జోడీని విడదీసేందుకు ఇంగ్లిష్‌‌ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్‌‌ కాలేదు. ఓ ఎండ్‌‌లో డాసన్‌‌ను స్థిరంగా కొనసాగిస్తూ రెండో ఎండ్‌‌లో పేసర్లను మార్చి ప్రయోగించారు. ఆర్చర్‌‌ బౌన్సర్లు, షార్ట్‌‌ పిచ్‌‌లతో దాడి చేసినా పంత్‌‌ తన ట్రేడ్‌‌ మార్క్‌‌ షాట్లతో ఆకట్టుకున్నాడు. కానీ 15 ఓవర్ల తర్వాత ఇండియాకు అతి పెద్ద నష్టం జరిగింది. 

వోక్స్​ బాల్​ను స్వీప్​ షాట్​ ఆడే క్రమంలో పంత్​ కుడి పాదానికి బలంగా తాకింది. వెంటనే వాపుతో పాటు, రక్తం కారడంతో  అతను గ్రౌండ్‌‌ నుంచి వెళ్లిపోయాడు. ఫస్ట్‌‌ ఎయిడ్‌‌ చేసిన అనంతరం స్కానింగ్‌‌ కోసం అంబులెన్స్‌‌లో హాస్పిటల్‌‌కు తరలించారు. పంత్‌‌ రిటైర్డ్‌‌తో క్రీజులోకి వచ్చిన జడేజా మెల్లగా ఆడాడు. 134 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేసిన సుదర్శన్‌‌ను 74వ ఓవర్‌‌లో స్టోక్స్‌‌ ఔట్‌‌ చేశాడు. పంత్‌‌తో 72 రన్స్‌‌ జోడించిన సుదర్శన్‌‌.. జడేజాతో 23 రన్స్‌‌ భాగస్వామ్యం నెలకొల్పి ఔటయ్యాడు. చివర్లో శార్దూల్‌‌ ఠాకూర్‌‌ ఫర్వాలేదనిపించాడు.