- టైర్లు ఎక్కడంతో కుడి కాలు నుజ్జునుజ్జు
మేడిపల్లి, వెలుగు: ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వకుండా నడుపుతుండడంతో డీసీఎం డ్రైవర్ నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా ఆటో డ్రైవర్.. డీసీఎం డ్రైవర్ను బస్సు కిందకు నెట్టేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ తట్టిఅన్నారం ప్రాంతానికి చెందిన కొనుగంటి శ్రీనివాస్(51) డీసీఎం డ్రైవర్. ఆదివారం ఉప్పల్ నుంచి ఘట్కేసర్ కు వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వకుండా వెళ్తుండడంతో కొంచెం ముందుకు వెళ్లి వాహనం ఆపి అతడిని నిలదీశాడు.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఆటో డ్రైవర్ శ్రీనివాస్ను నెట్టేయడంతో ఆర్టీసీ బస్సు కింద పడి ఆయన కుడి కాలు మోకాలి వరకు నుజ్జునుజ్జయింది. ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి బస్సు డ్రైవరే కారణమని పొరపాటు పడ్డ స్థానికులు అతడిపై దాడి చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
