హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఐబొమ్మ రవి కేసును విచారిస్తోన్న సైబర్ క్రైమ్ డీసీపీ ధార కవిత బదిలీ అయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఐబొమ్మ రవి కేసు విచారణ జరుగుతుండగానే ఆమెను బదిలీ చేయడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కవిత స్థానంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా అరవింద్ బాబు నియమితులయ్యారు. 2025, నవంబర్ 22న తెలంగాణ ప్రభుత్వం 8 మంది నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ట్రాన్స్ఫర్లు జరిగాయి. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా సుధీంద్ర బదిలీ అయ్యారు.
మూవీ పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత నేతృత్వంలో కూకట్ పల్లిలో రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రవి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. శనివారం (నవంబర్ 22) మూడో రోజు అతడి విచారణ ముగిసింది. విచారణలో పోలీసులకు రవి ఏమాత్రం సహకరించడం లేదు.
పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. యూజర్ ఐడీ, పాస్ వర్డ్లు అడిగితే గుర్తు లేదు, మరిచిపోయా అని సమాధానం ఇస్తున్నాడు రవి. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఓపెన్ చేయిస్తున్నారు పోలీసులు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్లో మెయిన్ సర్వర్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
►ALSO READ | గుర్తు లేదు, మర్చిపోయా.. విచారణలో ఐబొమ్మ రవి పొంతన లేని సమాధానాలు
బ్యాంక్ ఖాతాల వివరాలపైనా కూడా రవి నోర విప్పడం లేదు. రవి అకౌంట్ల చిట్టా ఇవ్వాలని పలు బ్యాంకులకు మెయిల్ చేశారు పోలీసులు. రవి ప్రతీ 20 రోజులకు ఒక దేశానికి వెళ్తున్న రవి..విదేశీ పర్యటనలు అంటే ఇష్టంతోనే వెళ్ళానని చెబుతున్నాడు. యూఎస్బీటీ ద్వారా వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేసేవాడని తేలింది. రవి విజిట్ చేసిన దేశాల్లో ఉన్న పైరసీ లింకుల గురించి కూపీ లాగుతున్నారు పోలీసులు..
పోలీసుల విచారణలో 21 వేలకు పైగా సినిమాలు రవి పైరసీ చేసినట్లు తేలింది. మూడు దేశాల్లో సర్వర్లు ఏర్పాటు చేసి సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. రవి కేసును ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.. ఈ కేసులో ఇవాళ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల విచారణ జరుపుతున్న సీఐడీ రవి విషయంలోనూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తోంది. మరో వైపు ఇదే కేసులో నవంబర్ 21న ఈడీ విచారించింది. రవి బ్యాంక్ ఖాతాల్లో రూ. 20 కోట్లు, క్రిప్టో ద్వారా నెలకు రూ.15లక్షలు జమ అయినట్లు గుర్తించారు.
