పద్మారావునగర్, వెలుగు: మైనర్లకు లిక్కర్ అమ్మే వారిపై కఠిన చర్యలుంటాయని డీసీపీ రష్మి పెరుమాళ్ హెచ్చరించారు. బుధవారం సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలోని అన్ని వైన్ షాప్ల యజమానులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ఎక్సైజ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని లైసెన్సుదారులకు సూచించారు.
షాపుల టైమింగ్స్ తప్పనిసరిగా పాటించాలని, అండర్ ఏజ్ లిక్కర్ వినియోగాన్ని అడ్డుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా సమయాలు పెంచడం నిషేధమన్నారు. పీక్ అవర్స్లో గుంపులను నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. షాపుల్లో ఎంట్రెన్స్, బిల్లింగ్ కౌంటర్లు, మిగతా ప్రదేశాలను కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. షాప్ పరిసరాలు, పార్కింగ్ ప్రాంతాల్లో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. పర్మిట్ రూమ్లలో ఎలాంటి గొడవలు జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
