డీడీ లోగోకు కాషాయరంగు

డీడీ లోగోకు కాషాయరంగు

    ఎరుపు నుంచి కొత్త కలర్​లోకి మార్చిన దూరదర్శన్​

    ట్విట్టర్​లో ప్రమోషనల్​ వీడియో.. ప్రతిపక్షాల విమర్శ

న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్​ వివాదంలో చిక్కుకున్నది. దాని ఇంగ్లీష్​ న్యూస్​ చానల్​ అయిన డీడీ న్యూస్​ లోగో రంగును మార్చడంపై ప్రతిపక్షాలనుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఇదివరకు ఈ  లోగో ఎరుపు రంగులో ఉండగా.. దాన్ని ఆరెంజ్​ (కాషాయరంగు) కలర్​లోకి మార్చారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రమోషన్​ వీడియో రూపంలో ట్విట్టర్​లో వెల్లడించింది. ‘ మా విలువలు అలాగే ఉన్నాయి. కానీ మేం ఇకనుంచి కొత్త అవతారంలో అందుబాటులో ఉంటాం. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా న్యూస్​ జర్నీకి సిద్ధం కండి. సరికొత్త డీడీ న్యూస్​ను ఆదరించండి ’ అని పేర్కొన్నది.

ప్రసార భారతి కాదు.. ప్రచార భారతి..

డీడీ న్యూస్​ కొత్త లోగోను ఎన్నికలముందే బీజేపీ జెండా రంగైన కాషాయంలోకి మార్చడంపై ప్రతిపక్షాలనుంచి విమర్శలు వెల్లువెత్తాయి.  తృణమూల్​ ఎంపీ, దూరదర్శన్​ మాజీ సీఈవో జవహర్​ సిర్కర్​ డీడీ న్యూస్​ లోగోమార్పును తప్పుబట్టారు. కలర్​ మార్పుతో ఇక అది ప్రసార భారతి కాదు.. ప్రచార భారతిగా మారుతున్నదనే భావన కలుగుతున్నదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఓ పార్టీ రంగును ప్రతిబింబించేలా లోగోను మార్చడం ఎలక్షన్​ కోడ్​ను ఉల్లంఘించడమేనని అన్నారు. కాగా, లోగో మార్పుపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ కూడా మండిపడింది. 

స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థలను నియంత్రణ చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇదని ఆరోపించింది. జాతీయ ప్రసార సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని మండిపడింది. ఇదిలా ఉండగా, లోగో కలర్​ మార్పును ప్రసార భారతి సీవో గౌరవ్​ ద్వివేది సమర్థించారు. చానల్​ బ్రాండింగ్​, దృశ్య సౌందర్యాన్ని  పెంచేందుకే లోగో కలర్​ను మార్చామని చెప్పారు. లోగోనే కాదు.. చానల్​ను కూడా అప్​గ్రేడ్ చేస్తున్నట్టు చెప్పారు. చానల్​ లోగో కలర్​ మార్పుపై విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు.