సవాళ్ల హీట్‌.. అసెంబ్లీలో కాంగ్రెస్.. ప్రెస్‌క్లబ్‌లో బీఆర్ఎస్

సవాళ్ల హీట్‌.. అసెంబ్లీలో కాంగ్రెస్.. ప్రెస్‌క్లబ్‌లో బీఆర్ఎస్
  • ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ల దోపిడీపై చర్చకు రావాలంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు
  • చర్చిద్దామంటూ ప్రెస్‌క్లబ్‌కు వెళ్లిన కేటీఆర్, బీఆర్ఎస్ లీడర్లు 
  • సీఎం రేవంత్ కోసమంటూ కుర్చీ ఏర్పాటు
  • అదే సమయంలో అసెంబ్లీకి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, కాంగ్రెస్ నేతలు 
  • చర్చకు రమ్మన్నది నిన్ను కాదు.. మీ నాయనను: పీసీసీ చీఫ్​
  • అసెంబ్లీకి రమ్మంటే తప్పించుకు తిరుగుతున్నారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల​ వార్​ ముదిరింది. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ల దోపిడీపై చర్చకు రావాలంటూ ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలంటూ బీఆర్ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌‌కు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్​రెడ్డి సవాల్ ​విసిరారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ స్పందించి.. ‘చర్చకు కేసీఆర్ అక్కర్లేదు.. నేను చాలు’ అని అన్నారు. ఆ అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు.

ఈ మేరకు మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్‌‌ను తీసుకుని కేటీఆర్‌‌ ప్రెస్‌క్లబ్‌కు వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కోసం కుర్చీ వేసి.. చర్చకు రావాలంటూ డిమాండ్​చేశారు. దీనికి కౌంటర్‌‌గా అదే టైమ్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, రామ్మోహన్​ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో చర్చకు రావాలని కేటీఆర్‌‌కు సవాల్ విసిరారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే బీఆర్ఎస్ నేతలు తప్పించుకుతిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. 

కేటీఆర్‌‌కు కాంగ్రెస్ కౌంటర్.. 
ఉదయం 10 గంటల నుంచే బీఆర్ఎస్​ నేతలు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకోవడం ప్రారంభించారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.  ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన కేటీఆర్.. అక్కడి నుంచి 11 గంటలకు ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్​ కోసం కుర్చీ ఏర్పాటు చేశారు. తనతో చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. సీఎం రావడం వీలుకాకపోతే కనీసం మంత్రులనైనా పంపించాలంటూ డిమాండ్​చేశారు. అదే సమయంలో అసెంబ్లీలోని సీఎల్పీలో కాంగ్రెస్​నేతలు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కౌంటర్​ఇచ్చారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చర్చకు పిలవలేదని, సీఎంతో చర్చించే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చర్చ కోసం అసెంబ్లీకి తీసుకురావాలంటూ సవాల్​చేశారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకుతిరుగుతున్న దొంగలంటూ  కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మండిపడ్డారు. 

సీఎం వర్సెస్ కేటీఆర్.. 
18 నెలల పాలనలోనే అన్నింటినీ గాడిలో పెడుతున్నామని సీఎం రేవంత్​రెడ్డి ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో చెప్పారు. ఒక్క ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, రైతు భరోసా ఇస్తున్నామని, సన్నొడ్లకు రూ.500 బోనస్​ఇస్తున్నామని తెలిపారు. ఏపీకి నీళ్లు దోచిపెట్టింది కేసీఆరేనని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ల దోపిడీపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలంటూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సవాల్ విసిరారు. అయితే, ఈ నెల 5న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌కు కేటీఆర్​ప్రతిసవాల్​విసిరారు. సీఎం రేవంత్​రెడ్డితో చర్చించేందుకు కేసీఆర్​అవసరం లేదని, తాను సరిపోతానని అన్నారు. ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో చర్చకు రావాలంటూ ప్రతిసవాల్​చేశారు. రైతులను సంక్షోభంలోకి నెట్టారని, కేసీఆర్​ఇచ్చిన నోటిఫికేషన్లకు అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్​లెటర్లు ఇచ్చి తామే ఉద్యోగాలిచ్చినట్టుగా ప్రకటనలు గుప్పించుకుంటున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇటు ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్, అటు అసెంబ్లీ వేదికగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.