
- పాల్గొన్న దీపాదాస్మున్షీ, మధు యాష్కీ, పార్టీ నాయకులు
హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్లో గురువారం కాంగ్రెస్పార్టీ నాయకులు, కార్యకర్తలు రుణమాఫీ సంబురాలు చేసుకున్నారు. మొదటి విడతలో భాగంగా గురువారం లక్ష లోపు బకాయి ఉన్న రైతులకు రుణమాఫీ అమలుకావడంతో ఈ ప్రోగ్రాంను కాంగ్రెస్ క్యాడర్ పండుగలా జరుపుకొంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజు ఆ పార్టీలో కనిపించిన జోష్.. మళ్లీ ఏడు నెలలకు ఇప్పుడు రైతు రుణమాఫీ అమలుతో కనిపించింది. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చిందన్న గర్వం, సంతోషం కాంగ్రెస్క్యాడర్, లీడర్లలో కనిపించింది.
దేశ చరిత్రలోనే గొప్పది: మధు యాష్కీ
ఏకకాలంలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే మొదటిసారి అని మధు యాష్కీ గౌడ్ మీడియాతో అన్నారు. దీంతో రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మరోసారి స్పష్టమైందన్నారు. 70 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల రుణాలు మాఫీ అవుతుండడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప విషయం అన్నారు.
రుణమాఫీని ప్రారంభించిన జులై 18 రైతుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేంద్రంలో పదేండ్ల పాలనను పూర్తిచేసుకున్న మోదీ ప్రభుత్వం.. రైతులు అడిగిన కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా, వారి గొంతు నొక్కిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పదేండ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం.. రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేయలేక, ఇచ్చిన మాట నిలుపుకోలేక చేతులెత్తేశారని విమర్శించారు.
తమ ప్రభుత్వం రుణమాఫీ ప్రారంభించడంతో.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుకు తల తిరిగిపోయి ఏం చేయాలో అర్థం కావట్లేదని మధు యాష్కీ విమర్శించారు. రుణమాఫీ నిర్ణయం రైతు లోకానికి శుభ సూచకమని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి రైతులకు మేలు జరిగేలా చూడాలని సూచించారు.
రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ సర్కార్ రుణమాఫీని అమలు చేస్తోందని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. దీని నుంచి తెల్ల రేషన్ కార్డు నిబంధన తీసేశామని, కేవలం రైతు పాస్ బుక్కులు మాత్రమే రుణమాఫీకి వర్తిస్తాయన్నారు.