నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం పెన్షనర్స్ డేను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్డింగ్లో పెన్షన్ పితామహుడు ధరం స్వరూప్ నకార ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. 75 ఏండ్లు పూర్తి చేసుకున్న రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జె.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి రిటైర్ అయిన వారంతా సకాలంలో పెన్షన్ పొందడంలో ధరం స్వరూప్ నకార కృషి ఉందని గుర్తు చేశారు. పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని, పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమేనని, పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సుధాకర్ రెడ్డి, చెన్నయ్య, వెంకటశెట్టి, సంజీవ గౌడ్, అబ్దుల్లా ఖాన్, జానకీరాములు పాల్గొన్నారు.
