రూపీక్ సీఈఓ సుమీత్ మనియర్
గోల్డ్లోన్స్కు మంచి భవిష్యత్ ఉంది
నెలకు రూ.వెయ్యి కోట్ల బిజినెస్ నా టార్గెట్ -సుమీత్ మనియర్
బెంగళూరు:సుమిత్ మనియార్ సంపన్న కుటుంబంలో పుట్టిపెరిగినా, ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ బాంబే ఐఐటీ గ్రాడ్యుయేట్ ఎన్నో సవాళ్లకు ఎదురు నిలిచి బెంగళూరులో గోల్డ్లోన్ లెండింగ్ స్టార్టప్ ‘రూపీక్’ను మొదలుపెట్టారు . ఈ కంపెనీ ఏర్పాటు వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. రాజస్థాన్లోని తన ఆస్తిని తనఖా పెట్టుకొని లోన్ ఇవ్వాలని సుమిత్ అడిగితే ఒక ఎన్బీఎఫ్సీ రిజెక్ట్ చేసింది. ఇంత ఆస్తిని తనఖా పెట్టినా అప్పు పుట్టకపోవడంతో ఆయన షాకయ్యారు. కస్టమర్లకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా, బంగారం తనఖాగా పెట్టుకొని లోన్ ఇచ్చే కంపెనీని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. దీని ఫలితమే రూపీక్! సుమిత్ ఆలోచనను సెకోవియా క్యాపిటల్, ఎస్సెల్, ఫ్లిప్కార్ట్ కో–ఫౌండర్ బిన్నీ బన్సాల్ ఎంకరేజ్ చేసి ఫండింగ్ ఇచ్చారు. 2015లో రూపీక్ ఏర్పాటైనప్పటి నుంచి దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ స్టార్టప్ వాల్యుయేషన్ 300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ2,200 కోట్లు)వరకు ఉంటుంది. నెలకు రూ.250 కోట్ల విలువైన గోల్డ్ లోన్లు ఇస్తుంది. ఈ ఏడాది చివరిలోపు దీనిని రూ.వెయ్యి కోట్లకు పెంచాలన్నది సుమిత్ టార్గెట్.
సక్సెస్ఫుల్ కంపెనీలు తక్కువే..
టెక్ బేస్డ్ లెండింగ్ స్టార్టప్లు మనదేశంలో చాలా ఏర్పాటయ్యాయి కానీ సక్సెస్రేటు తక్కువ. గత పదేళ్లలో నిలబడిన స్టార్టప్లు చాలా చాలా తక్కువ. అయితే టెక్నాలజీతో సంబంధం లేకుండా లోన్లు ఇచ్చిన స్టార్టప్లు నిలదొక్కుకున్నాయి. ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్, వెరిటాస్ ఫైనాన్స్, ఎస్ కే ఫిన్కార్ప్ వంటివి ఇందుకు ఉదాహరణ. ఈ పరిస్థితిని మార్చాలని సుమిత్ నిర్ణయించుకున్నారు. టెక్ బేస్డ్ లెండింగ్ కంపెనీలు కూడా గోల్డ్లోన్ల ద్వారా ఎదగొచ్చని నిరూపించారు. ఇలాంటి స్టార్టప్లకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వీళ్లు ఇచ్చే అప్పులు సెక్యూర్డ్ లోన్లు. ప్రాసెసింగ్ ఖర్చులు చాలా తక్కువ.. రూపీక్ కూడా ముతూట్, మణప్పురం ఫైనాన్స్ వంటి గోల్డ్లోన్ కంపెనీల మాదిరిగానే బిజినెస్ చేస్తోంది. వీధుల్లోకి వెళ్లి మరీ లోన్లు ఇస్తోంది.
అన్ని చోట్లా లాభాలు రావట్లే…
రూపీక్ 20 సిటీల్లో బిజినెస్ చేస్తుండగా, లాభాలు మాత్రం 12 సిటీల నుంచి మాత్రమే వస్తున్నాయి. నష్టాల నుంచి బయటపడేందుకు కొన్నేళ్లు పడుతుందని సుమిత్ అన్నారు. నెలకు రూ.రెండు వేల కోట్ల విలువైన లోన్లు ఇవ్వగలిగితే తమకు ఎదురే ఉండదని స్పష్టం చేశారు. రూపీక్ కస్టమర్లలో ఎక్కువ మంది మొదటిసారి అప్పుతీసుకునేవాళ్లే! సగటున రూ.1.5 లక్షల వరకు గోల్డ్లోన్లు తీసుకుంటున్నారు. రూపీక్కు ప్రస్తుతం నెలకు రూ.7–10 కోట్ల రెవెన్యూ మాత్రమే వస్తోంది. సుమిత్ మాత్రం ఈ విషయంలో బాధపడటం లేదు. రెవెన్యూ పెరగడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.
ఎన్నో కంపెనీల్లో పనిచేశాక…
చదువు పూర్తయ్యాక సుమిత్ జేపీ మోర్గన్, రెలిగేర్ వంటి కంపెనీల్లో 2012 వరకు పనిచేశారు. లెండింగ్ స్టార్టప్ను మొదలుపెట్టాలన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఫైనాన్షియల్ ఎనలిస్టు కాబట్టి ముతూట్, మణప్పురం ఫైనాన్స్ ఫండ్ రైజింగ్స్ను గమనించారు. ‘‘వాటి ఎకనమిక్స్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ రెండు కంపెనీలకు విపరీతమైన ఆదాయం ఉంది. వేగంగా ఎదుగుతున్నాయి. మూలధనం కూడా పెద్దగా లేదు. ఏం జరుగుతోందని ఆలోచించాను’’ అని అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు సుమిత్. తరువాత ఎడ్యుకేషన్ స్టార్టప్ను మొదలుపెట్టినా అది సక్సెస్ కాలేదు. తదనంతరం గోల్డ్పై విపరీతంగా స్టడీ చేశారు. ఎన్నో కంపెనీలతో, ఇన్వెస్టర్లతో, కస్టమర్లతో చర్చించి రూపీక్ను మొదలుపెట్టారు.