
- గత రెండేళ్లలో తగ్గిన స్కూల్ స్టూడెంట్లు
- టీచర్లు, బడుల సంఖ్య కూడా తగ్గుముఖమే
- ప్రభుత్వమిచ్చే బడ్జెట్దీ ఇదే పరిస్థితి
- అసెంబ్లీకి స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన నివేదికలో వెల్లడి
రాష్ట్రంలో గత రెండేళ్లలో స్కూల్ స్టూడెంట్ల సంఖ్య తగ్గింది. పాఠాలు చెప్పే టీచర్లు తగ్గిపోయిన్రు. బడుల సంఖ్య కూడా తగ్గింది. చివరికి స్కూల్ ఎడ్యుకేషన్కు ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్దీ ఇదే పరిస్థితి. స్టూడెంట్ల సంఖ్య తగ్గినా అది గవర్నమెంట్లోనే తగ్గింది. టీచర్ల సంఖ్య మాత్రం ప్రైవేటు, సర్కారు రెండింటిలో తగ్గింది. బడులు సర్కారుతో పోలిస్తే ప్రైవేటులోనే బాగా తగ్గాయి. బడ్జెట్ విషయానికి వస్తే గతేడాదితో పోలిస్తే రూ. 2,621 కోట్లను సర్కారు కోత పెట్టింది. ఇటీవల అసెంబ్లీకి స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన నివేదికలో ఈ విషయాలన్నీ చెప్పింది.
25 వేల మంది స్టూడెంట్స్ తగ్గారు
రాష్ట్రంలో 2017-18 విద్యా సంవత్సరంలో ప్రైవేటు, సర్కారు కలిపి 40,841 స్కూళ్లలో 58,36,310 మంది స్టూడెంట్లు చదివారు. 2018–19లో 40,597 స్కూళ్లలో 58,10,490 మంది చదువుకున్నారు. ఈ లెక్కన 25,820 మంది తగ్గారు. అప్పర్ ప్రైమరీలో 13,316 అడ్మిషన్లు తగ్గగా, హైస్కూల్ స్థాయిలో మాత్రం 48,779 అడ్మిషన్లు పెరిగాయి. మొత్తం గవర్నమెంట్ స్కూళ్లలో 71,810 అడ్మిషన్లు తగ్గగా ప్రైవేటులో 45,990 పెరిగాయి. ప్రైమరీ, యూపీఎస్ స్కూళ్లలో అడ్మిషన్లు తగ్గడానికి జననాల రేటు తగ్గడమే కారణమని అసెంబ్లీకిచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. 2001 నుంచి 2011 సంవత్సరాల్లో ఆరేండ్లలోపు పిల్లలు 15 లక్షల మంది తగ్గినట్టు జనాభా లెక్కలు చెబుతున్నాయని చెప్పారు.
ఒక్క ఏడాదిలోనే 9,781 మంది
2017-18లో 2,48,659 మంది టీచర్లుంటే 2018-19కి ఆ సంఖ్య 2,38,878కు తగ్గింది. ఒక్క ఏడాదిలోనే 9,781 మంది తగ్గిపోయారు. ప్రైమరీ స్థాయిలో1,721 మంది తగ్గగా అప్పర్ ప్రైమరీ లెవల్లో 4,371 మంది, హైస్కూల్ స్థాయిలో 3,689 మంది తగ్గిపోయారు. విద్యాహక్కు చట్టం ప్రకారం క్వాలిఫైడ్ టీచర్లను ఎంపిక చేసుకోవాలని ప్రైవేటు స్కూళ్లకు ఆదేశాలివ్వడంతో టీచర్ల సంఖ్య కొంత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. సర్కారు టీచర్ల రిటైర్మెంటూ కారణమంటున్నారు.
బడ్జెట్ కూడా తగ్గింది
స్కూల్ ఎడ్యుకేషన్కు నిధులు భారీగానే తగ్గాయి. 2018-19లో 10,830 కోట్లు కేటాయిస్తే 2019–20లో 8,209 కోట్లు కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్ టీచర్లు, ఉద్యోగులు, అధికారుల జీతభత్యాలకే సరిపోతుందని అధికారులు అంటున్నారు. బడుల అభివృద్ధికి, కొత్త పథకాలకు నిధులివ్వలేదని వాపోతున్నారు.
244 స్కూళ్లు తగ్గినయ్
2017-18లో 40,841 స్కూళ్లుంటే 2018–19కు 40,597 అయ్యాయి. మొత్తంగా 210 ప్రైవేటు స్కూళ్లు, 34 సర్కారీ స్కూళ్లు తగ్గాయి. ప్రైవేటు మేనేజ్మెంట్ పరిధిలోని ప్రైమరీ స్కూళ్లే 104 తగ్గడం గమనార్హం. ఈ మధ్య కాలంలో ప్రైమరీ, ప్రీ ప్రైమరీ స్కూళ్లు భారీగా పెరుగుతున్నా వాటికి అధికారిక గుర్తింపు లేక స్కూళ్ల సంఖ్య తగ్గుతున్నట్టు తెలుస్తోంది. స్టేట్లో మొత్తం 25,660 జనావాసాలకు గానూ 25,199 ఊళ్లల్లో ప్రైమరీ స్కూళ్లు.. 23,949 ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 84 శాతం జనావాసాల్లో హైస్కూళ్లున్నాయని, 100 శాతం స్కూళ్లుండేలా సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు.