దళితబంధు యూనిట్లలో  నాసిరకం వాహనాలు ? 

దళితబంధు యూనిట్లలో  నాసిరకం వాహనాలు ? 

జమ్మికుంట / వీణవంక, వెలుగు : దళితబంధులో భాగంగా ప్రభుత్వం అందజేస్తున్న యూనిట్లలో లబ్ధిదారులకు నాసిరకం వాహనాలు చేరుతున్నాయి. కరీంనగర్​ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లిలో  ఇద్దరు లబ్ధిదారులకు కలిపి ఒక యూనిట్​ కింద హార్వెస్టర్​ ఇవ్వగా పాత బాడీ కి కొత్త ఇంజిన్​ బిగించి ఇచ్చారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కోరుకంటి రేణుక, కోరుకంటి అంజయ్య కుటుంబాలకు కలిపి ఒక యూనిట్​గా సర్కారు హార్వెస్టర్​మంజూరు చేసింది. రెండు రోజుల క్రితం మహీంద్రా కంపెనీకి చెందిన హార్వెస్టర్​ను అధికారులు, లీడర్లు లబ్ధిదారులకు అందజేశారు. అయితే ఇంటికి వెళ్లాక హార్వెస్టర్​ను పరిశీలించి చూడగా ఇంజిన్ ​మాత్రమే కొత్తగా ఉందని, పాత బాడీకి అక్కడక్కడా రంగు పూసి ఇచ్చినట్టు కనిపిస్తోందని లబ్ధిదారులు ఆరోపించారు. మధ్యలో వెల్డింగ్​ కూడా చేశారని చెప్పారు. హార్వెస్టర్​కు రూ.20 లక్షలు ఉంటుందని, అతుకుల బొంతను అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.