పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. శనివారం ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ రాశారు. విశాల్ దడ్లాని పాడాడు.
‘రంపంపం రంపంపం రపంపం.. స్టెప్పేస్తే భూకంపం.. ధమ్ ధమ్.. రిథమ్ ధమ్.. ఫ్లోర్ మీద హోరు గాలి రప్పిద్దాం.. బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా.. రే ఆఫ్ హోపే తగ్గుతున్నా.. టగ్ ఆఫ్ వారే జరుగుతున్నా.. దేఖ్లేంగే సాలా.. చూసినాంలే చాలా..’ అంటూ సాగిన ఈ పాటలో పవన్ కళ్యాణ్ స్టైలిష్గా కనిపిస్తూ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్తో ఇంప్రెస్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ను రాజమండ్రిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అభిమానులందరూ మళ్ళీ మళ్ళీ చూసేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. ‘జీవితంలో సమస్యలు రావడం సహజం. అప్పుడు మనం పాటించాల్సిన సూత్రం ఏంటో తెలుసా.. అదే ఈ పాట’ అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారి ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ డైలాగ్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పాటకు సాహిత్యం రాశానని గీత రచయిత భాస్కరభట్ల అన్నారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ ‘ఇది ఆరంభం మాత్రమే.. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి కంటెంట్ ఈ స్థాయిలోనే ఉంటుంది’ అని అన్నారు.
