ఢిల్లీ ‘సిక్సర్‌’..పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ

ఢిల్లీ ‘సిక్సర్‌’..పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ

అహ్మదాబాద్‌‌: ఐపీఎల్‌‌–14లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ జోరు కొనసాగుతోంది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొడుతూ.. ఎదురొచ్చిన ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలు సాధిస్తోంది. తాజాగా ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 7 వికెట్ల తేడాతో పంజాబ్‌‌ కింగ్స్‌‌పై గెలిచి.. ఆరో విజయంతో టేబుల్‌‌ టాపర్‌‌గా నిలిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 రన్స్‌‌ చేసింది. తాత్కాలిక కెప్టెన్‌‌ మయాంక్‌‌ అగర్వాల్‌‌ (58 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 నాటౌట్‌‌) ముందుండి ఇన్నింగ్స్‌‌ నడిపించాడు. థర్డ్‌‌ ఓవర్‌‌లో భారీ సిక్సర్‌‌ కొట్టిన ప్రభుసిమ్రన్‌‌ సింగ్‌‌ (12) తర్వాతి ఓవర్‌‌లోనే వెనుదిరిగాడు. అయితే తర్వాతి ఓవర్‌‌లో మయాంక్‌‌ రెండు ఫోర్లు కొట్టినా.. ఆరో ఓవర్‌‌లో క్రిస్‌‌ గేల్‌‌ (13) సిక్సర్‌‌ కొట్టి వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. 29కే 2 వికెట్లు పడటంతో మయాంక్‌‌ ఇన్నింగ్స్‌‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. పవర్‌‌ప్లేలో 39/2 స్కోరుతో ఉన్న పంజాబ్‌‌.. ఫస్ట్‌‌ టెన్‌‌ ఓవర్స్‌‌లో 63/2కు చేరింది. తర్వాత వచ్చిన మలన్‌‌ (26).. ఇషాంత్‌‌ ఓవర్‌‌లో సిక్స్‌‌, ఫోర్‌‌తో మెరిసినా.. 14వ ఓవర్‌‌లో పంజాబ్‌‌కు డబుల్‌‌ షాక్‌‌ తగిలింది. వరుస బాల్స్‌‌లో మలన్‌‌, దీపక్‌‌ హుడా (1) ఔటయ్యారు. 15వ ఓవర్‌‌ నుంచి మయాంక్‌‌ ఆట మరో మెట్టు ఎక్కింది. రబాడ (3/36) బౌలింగ్‌‌లో సిక్సర్‌‌, తర్వాతి ఓవర్‌‌లో 4, 6తో రెచ్చిపోయాడు. 17వ ఓవర్‌‌లో రెండు ఫోర్లు బాదాడు. కానీ 18, 19వ ఓవర్లలో  షారూక్‌‌ ఖాన్‌‌ (4), జోర్డాన్‌‌ (2) ఔటైనా.. మధ్యలో మయాంక్‌‌ సిక్సర్‌‌తో ఊపు తెచ్చాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో హర్‌‌ప్రీత్‌‌ ఒక ఫోర్‌‌ కొడితే, మయాంక్‌‌ 4, 6, 4తో 99 రన్స్‌‌కు చేరుకున్నాడు.  

ధవన్‌‌.. దంచెన్‌‌

తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 167 రన్స్‌‌ చేసి గెలిచింది. ఓపెనర్లు పృథ్వీ షా (22 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 22), ధవన్‌‌ (47 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 నాటౌట్‌‌) దడదడలాడించారు. షమీ, రవి, జోర్డాన్‌‌ బౌలింగ్‌‌లో మూడు టవరింగ్‌‌ సిక్సర్లు బాదిన పృథ్వీ... ఫస్ట్‌‌ వికెట్‌‌కు 63 రన్స్‌‌ జోడించి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన స్మిత్‌‌ (25).. శిఖర్‌‌కు అండగా నిలిచాడు. భారీ షాట్లకు పోకుండా వికెట్‌‌ను కాపాడుకుంటూ.. సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో రన్‌‌రేట్‌‌ను పెంచారు. దీంతో పవర్‌‌ప్లేలో 63/0తో ఉన్న స్కోరు 10 ఓవర్లలో87/1కు పెరిగింది. 12వ ఓవర్‌‌లో ధవన్‌‌ ఫస్ట్‌‌ సిక్సర్‌‌ కొట్టాడు. అయితే సాఫీగా సాగిపోతున్న ఇన్నింగ్స్‌‌లో స్మిత్‌‌ను ఔట్‌‌ చేసి మెరిడిత్‌‌ (1/36) షాకిచ్చాడు. సెకండ్‌‌ వికెట్‌‌కు 48 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. కెప్టెన్‌‌ పంత్‌‌ (14) వచ్చి రావడంతో అటాకింగ్‌‌ మొదలుపెట్టాడు. 14వ ఓవర్‌‌లో ధవన్‌‌ 6, 4తో రెచ్చిపోతే, పంత్‌‌ ఫోర్‌‌తో టచ్‌‌లోకి వచ్చాడు. తర్వాతి ఓవర్‌‌లో ఇద్దరు 4, 6తో 13 రన్స్‌‌ రాబట్టారు. గెలవాలంటే 24 బాల్స్‌‌లో 23 రన్స్‌‌ కొట్టాల్సిన దశలో పంత్‌‌ ఔటయ్యాడు. అయితే హెట్‌‌మయర్‌‌ (16 నాటౌట్‌‌).. 18వ ఓవర్‌‌లో 6, 6, 4తో బాది విజయాన్ని ఖాయం చేశాడు.  

సంక్షిప్త స్కోర్లు:పంజాబ్‌‌: 166/6 (మయాంక్‌‌ 99 నాటౌట్‌‌, మలన్‌‌ 26, రబాడ 3/36), ఢిల్లీ: 167/3 (ధవన్‌‌ 69 నాటౌట్‌‌, పృథ్వీ షా 39, స్మిత్‌‌ 25, హర్‌‌ప్రీత్‌‌ 1/19).