ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసకెళ్తోంది. ఆ పార్టీ ఇప్పటికే 107 స్థానల్లో విజయం సాధించగా.. 20 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ 84 స్థానాల్లో గెలిపొందగా.. 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 5 స్థానాల్లో విక్టరీ కొట్టగా మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆప్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కేజ్రీవాల్ ఇంటివద్దకు ఆ పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు అవసరమైన 126 వార్డులను సునాయాసంగా కైవసం చేసుకునే దిశగా ఆప్ దూసుకెళుతోంది. ఎంసీడీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండటంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
మూడు బాడీలుగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒకే గొడుగు కిందకు తెచ్చింది కేంద్రం ప్రభుత్వం. ఈ ఏడాది మేలో బిల్లు పెట్టి.. ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్, సౌత్ ఢిల్లీ కార్పోరేషన్లను రద్దు చేసి.. మూడింటిని కలిపి ఒకే మున్సిపల్ కార్పోరేషన్ గా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీగా ఏర్పాటు చేసి.. వార్డులను 250స్థానాలకు కుదించారు. మొత్తం 250 వార్డులకు గాను 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అన్ని పార్టీలు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నాయి.