ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్ కౌంటర్.. బీహార్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతం

ఢిల్లీ రోహిణిలో భారీ ఎన్ కౌంటర్.. బీహార్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతం

న్యూఢిల్లీ: బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లను ఢిల్లీ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్లో నలుగురు బీహార్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాల సమయంలో పోలీసులకు, ఈ గ్యాంగ్ స్టర్లకు మధ్య కాల్పులు జరిగాయి. బహదూర్ షా మార్గ్ దగ్గర ఈ ఎన్ కౌంటర్ జరిగింది. రోహిణిలోని డాక్టర్ బీఎస్ఏ హాస్పిటల్లో నలుగురు నిందితులను చేర్పించగా.. నలుగురూ అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించారు.

రోహిణి ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఈ గ్యాంగ్స్టర్స్ హతమయ్యారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో రంజన్ పాతక్ (25), బీమ్ లేష్ మహతో (25), మనీష్ పాతక్ (33), అమన్ ఠాకూర్ (21) చనిపోయారు. రంజన్ పాతక్, బీమ్ లేష్ మహతో, మనీష్ పాతక్ బీహార్కు చెందిన సీతామర్హి ప్రాంతానికి చెందిన గ్యాంగ్ స్టర్లు కాగా.. అమన్ ఠాకూర్ స్వస్థలం కార్వాల్ నగర్, ఢిల్లీ. పోలీసులు పక్కా సమాచారంతో ఈ ఎన్ కౌంటర్ జరిపారు. ఈ నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు కావడం గమనార్హం. పోలీసులకు, నలుగురు నిందితులకు మధ్య తెల్లవారుజామున 2:20 గంటలకు కాల్పులు జరిగిన దృశ్యాలను ఢిల్లీ పోలీసులు ఒక ట్వీట్‌లో విడుదల చేశారు.

బీహార్ ఎన్నికలకు ముందు ఈ నలుగురు పెద్ద కుట్రకు ప్లాన్ చేశారని సమాచారం. ఈ నలుగురు నిందితులు బీహార్‌లో చాలా క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. 'సిగ్మా & కంపెనీ' అని పిలువబడే ఈ గ్యాంగ్స్టర్ ముఠాకు రంజన్ పాఠక్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నేరస్థులు బీహార్‌లో నమోదైన అనేక ప్రధాన కేసుల్లో పరారీలో ఉన్నారు.