న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ.. యూత్ ఫుల్ ట్రెండ్తో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’కి ఢిల్లీ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. సీజేపీ అఫీషియల్ ఎక్స్ అకౌంట్ను వెంటనే పునరుద్ధరించడం కుదరదని స్పష్టం చేసింది. తక్షణ రిలీఫ్ కోరిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అభ్యర్థనను తోసిపుచ్చింది.
పిటిషన్ పై స్పందించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జాతీయ భద్రతా కారణాల పేరుతో సీజేపీ ఎక్స్ అకౌంట్ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల బ్లాక్ చేసింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అభిజీత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ అకౌంట్ను వెంటనే పునరుద్ధరించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ శుక్రవారం విచారించారు.
ఈ సందర్భంగా కోర్టు కీలక కామెంట్లు చేసింది. "మీరు సమర్పించిన వాదనల్లో ఎంతో కొంత విషయం ఉండవచ్చు. మేం కాదనడం లేదు. కానీ ఇతర కేసులకు.. ఈ కేసుకూ కొద్దిగా వ్యత్యాసం ఉంది. మిగతా కేసుల్లో కొన్ని నిర్దిష్ట ట్వీట్లు మాత్రమే వివాదాస్పదంగా ఉండేవి. కానీ, ఈ కేసులో ఎక్స్ అకౌంట్ను సంబంధించిన మొత్తం యాక్టివిటీయే అభ్యంతరకరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఒక ట్వీట్కు, ఒక పూర్తి అకౌంట్కు మధ్య ఉన్న తేడాను మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ అంశం సుదూర పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నందున ఓ నిర్ణయం తీసుకోవడానికి ముందు అవతలి పక్షం (కేంద్ర ప్రభుత్వం) వాదనలు కూడా వినాల్సి ఉంది.
కేసు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి.. ఇప్పుడే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకో" అని కోర్టు పేర్కొంది. ఈ విషయంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను జూలై 6కు వాయిదా వేసింది.
