పైలట్‌‌‌‌కు కరోనా.. ఫ్లైట్‌ వెనక్కి

పైలట్‌‌‌‌కు కరోనా.. ఫ్లైట్‌ వెనక్కి
  • ఢిల్లీ నుంచి మాస్కో వెళ్లిన ఫ్లైట్‌
  • ప్యాసింజర్లు లేకుండానే తిరుగు ప్రయాణం

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి రష్యాలోని మాస్కోకు వెళ్లిన ఎయిర్‌‌ఇండియా వందేభారత్‌ ఫ్లైట్‌ను అధికారులు వెనక్కి పిలిపించారు. ప్యాసింజర్లు లేకుండానే ఖాళీ ఫ్లైట్‌ శనివారం ఢిల్లీకి చేరుకుంది. పైలెట్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో అప్రమత్తమైన అధికారులు ఉజ్బకిస్తాన్‌ నుంచి ఫ్లైట్‌ను వెనక్కు పిలిపించారు. ఎయిర్‌‌ ఇండియాకు చెందిన A-320 నియో (వీటీ–ఈఎక్స్‌ఆర్‌‌) మాస్కోలోని మన వాళ్లను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఫ్లైట్‌ స్టార్ట్‌ అయ్యేముందు సిబ్బందికి కరోనా టెస్టులు చేయగా.. పైలెట్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే పొరపాటున పాజిటివ్‌ బదులు నెగటివ్ వచ్చిందని చెప్పడంతో అతను డ్యూటీ ఎక్కాడని అధికారులు చెప్పారు. ఆ తర్వాత వెంటనే సరిచూసుకుని ఫ్లైట్‌ను వెనక్కు తెప్పించామని, సిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌లో ఉంచామని అన్నారు. ప్యాసింజర్ల కోసం మరో ఫ్లైట్‌ను ఏర్పాటు చేసి పంపారు. ట్రావెల్‌ బ్యాన్‌ కారణంగా విదేశాల్లో చిక్కకున్న మనవాళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగానే ఆయా దేశాలకు ఫ్లైట్లను ఏర్పాటు చేసి.. సిబ్బందికి కరోనా టెస్టులు చేసిన తర్వాత డ్యూటీలకు అనుమతిస్తుంది.