ఎన్నాళ్లకెన్నాళ్లకు... ఢిల్లీలో తొమ్మిదేళ్లకు కొత్త వాతావరణం

ఎన్నాళ్లకెన్నాళ్లకు... ఢిల్లీలో తొమ్మిదేళ్లకు  కొత్త వాతావరణం

దేశ రాజధాని ఢిల్లీలో  కొద్ది రోజులుగా పెరుగుతున్న  కాలుష్యం ఈ నెలలో ( ఫిబ్రవరి 2024) లో తగ్గుముఖం పట్టిందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది.ఢిల్లీలో వాయు నాణ్యతను పెంచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ప్రభుత్వం భావించింది. అయితే దానికి ముందే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కాలుష్యం తగ్గింది.  గత 9 సంవత్సరాల్లో లేని గాలి నాణ్యత 2024  ఫిబ్రవరిలో నమోదైంది. 

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాతావరణ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. పొల్యూషన్‌తో గత కొన్నేళ్లుగా హడలెత్తిపోతున్నారు. ఢిల్లీ అంటేనే ఊపిరిపీల్చుకునే పరిస్థితులు ఉండేవి కావు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండే వారు. కానీ ఈనెలలో ( ఫిబ్రవరి 2024)  మాత్రం ఢిల్లీ సరికొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. గత 9 సంవత్సరాల్లో లేని గాలి నాణ్యత.. ఈనెలలోనే నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది.

ఫిబ్రవరిలో గాలి నాణ్యత సూచిక 200 కంటే తక్కువగా నమోదైనట్లుగా తెలిపారు. గతంలో అయితే AQI 400 నమోదు అయిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో ఇదే అత్యుత్తమంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెప్పుకొచ్చింది. ఇక ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 2013 తర్వాత ఇదే అత్యధికమని పేర్కొంది. పొల్యూషన్ కారణంగా అనేక రోజులు స్కూళ్లకు సెలవులు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వాహనాలకు సరి-బేసి విధానాన్ని కూడా ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసింది. మొత్తానికి 9 ఏళ్ల తర్వాత వాతావరణం కుదిటపడడంతో ఢిల్లీ వాసులకు ఇది శుభపరిణామమే.