న్యూఢిల్లీ: ఢిల్లీలో ఐదంతస్తుల పీజీ హాస్టల్ కూలిన ఘటనలో నిరాశ్రయులైన విద్యార్థులకు ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) అండగా నిలిచింది. సోమవారం తన పరిధిలోని పలు కాలేజీల్లో సాధారణ తరగతులను పూర్తిగా నిలిపివేసింది. ఆయా కాలేజీల్లోని క్లాస్ రూములతో పాటు ఆరోగ్య కేంద్రాలు, సిబ్బంది విశ్రాంతి గదులు, గెస్ట్ రూమ్లను సైతం నిరాశ్రయ విద్యార్థులకు తాత్కాలిక ఆశ్రయాలుగా మార్చింది.
బాధిత విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాలేజీల యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలుగా మార్చిన గదుల్లో పరుపులు, దుప్పట్లను సిద్ధం చేశారు. బాధితులకు ఆకలి తీర్చేందుకు వేడి వేడి ఆహారాన్ని, త్రాగునీటిని అందించారు. ఈ ప్రమాదంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు.
వెంకటేశ్వర కాలేజ్, మోతీలాల్ నెహ్రూ కాలేజ్, జీసస్ అండ్ మేరీ కాలేజ్, ఆత్మరామ్ సనాతన్ ధర్మ కాలేజ్ తదితర ప్రముఖ విద్యాసంస్థలు ముందుకు వచ్చి విద్యార్థులకు ఆశ్రయం కల్పించాయి. విద్యార్థినులకు నచ్చిన కాలేజీల్లో, మేల్ విద్యార్థులకు వారి సంబంధిత కాలేజీల్లో వసతి ఇచ్చారు. ఢిల్లీకి వచ్చే విద్యార్థుల తల్లిదండ్రుల బస కోసం వర్సిటీకి చెందిన ఏఐసీటీఈ గెస్ట్ హౌస్ను కేటాయించారు. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశారు.
