మంజీర రివర్ కారిడార్ నిర్మించాలి : కార్పొరేషన్మాజీ చైర్మన్ భిక్షపతి

మంజీర రివర్ కారిడార్ నిర్మించాలి : కార్పొరేషన్మాజీ చైర్మన్ భిక్షపతి

జోగిపేట, వెలుగు: మంజీర రివర్​ కారిడార్​ నిర్మాణం కోసం మంగళవారం పార్టీలకతీతంగా నాయకులు జోగిపేటలో ప్రెస్​మీట్​ ఏర్పాటు చేశారు. మంజీర నదికి కారిడార్​ నిర్మిస్తే జోగిపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రైల్వేసాధన సమితి కన్వీనర్​ గంగా జోగినాథ్, ట్రేడ్​ కార్పొరేషన్​మాజీ చైర్మన్​ భిక్షపతి, జిల్లా బీజేపీ నాయకులు ప్రభాకర్​గౌడ్​, మాజీ ఎంపీపీ రామాగౌడ్​తెలిపారు. 

ఈ విషయం గురించి ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు.  ఉమ్మడి మెదక్​ జిల్లాలోని చౌటకూర్​ మండలంలోని శివ్వంపేట నుంచి మెదక్​ ఘన్​పూర్​ వరకు మంజీర నది పారుతుందన్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న  రీజినల్​ రింగ్​రోడ్​ చౌటకూర్​ మండలం నుంచి వెలుతున్నందున ఆ  రహదారిని కలిపే సౌలభ్యం ఉంటుందన్నారు. 

దీని వల్ల నది పరివాహక  గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. హైదరాబాద్​కు వెళ్లడానికి రవాణా దూరం చాలా తగ్గుతుందన్నారు. ఈ కారణంగా జోగిపేట ప్రాంతంలో ఐటీ డిపార్ట్​మెంట్ వంటివి ఏర్పాటుకు అవకాశాలు ఉంటాయన్నారు. ఈ ప్రాంతంలో యువకులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు.