- జాతిపిత’ గుర్తింపు కోసం పోరాడుతం
- ప్రభుత్వం ప్రకటించకపోతే ఏప్రిల్ 6న బహిరంగ సభ పెట్టి ప్రకటిస్తం
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ సమాజం గర్వించదగ్గ ప్రజావిప్లవ గళం.. నిత్యం ప్రజల పక్షాన పోరాడిన యోధుడు..తెలంగాణ జాతిపితగా పేర్కొనేందుకు అన్ని అర్హతలున్న వ్యక్తి గద్దర్ మాత్రమేనని మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. గద్దర్పై కాల్పులు జరిపిన ఏప్రిల్6ని గుర్తు చేసుకుంటూ బుధవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గద్దర్గళం ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రముఖ అంబేద్కరిస్ట్ జీబీ రాజు, సీనియర్పాత్రికేయుడు పాశం యాదగిరి, సామాజిక ఉద్యమకారుడు పృథ్వీరాజ్, మాల విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ.. నిత్యం ప్రజాఉద్యమాలను నడుపుతూ మానవతా విలువల కోసమే పరితపించిన వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సైతం తన కుటుంబాన్ని కాదని కేవలం దగాపడిన వ్యక్తుల హక్కుల పరిరక్షణకోసమే పోరాడారని కొనియాడారు. తెలంగాణ జాతి పితగా అన్ని అర్హతలు కేవలం గద్దర్కే ఉన్నాయన్నారు. దేశమంటే జాతీయ నాయకులు చాలా మంది గుర్తుకు వస్తారని, అయితే, తెలంగాణకు సింబల్గా గద్దర్ను ప్రత్యేకంగా గుర్తించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
సబ్బండ వర్గాలకు ఆదర్శంగా ఉన్న ప్రజా కవి, గాయకుడు గద్దర్దానికి అర్హుడన్నారు. నేటి తరం కళాకారులు, రచయితలు గద్దర్ను తమ రచనలు, పాటలతో తెలంగాణ పితగా రాసి పాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే తరాలు ఆయనను గుర్తుచుకోవాలంటే కళాకారులు తమ కలానికి, గళానికి పని చెప్పాలని సూచించారు. శ్రామిక వర్గాలను అక్కున చేర్చుకున్న ప్రజా యుద్దనౌక గద్దర్ అన్న విషయాన్ని భవిష్యత్ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కవులు, కళాకారులకే ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ చట్టం తెచ్చిండు
కుల, మతాలకతీతంగా దగాపడిన వ్యక్తుల హక్కుల సాధనకు నిరంతరం శ్రమించిన వ్యక్తి గద్దర్ అని ప్రముఖ అంబేద్కరిస్ట్, దళిత ఉద్యమకారుడు జేబీ. రాజు అన్నారు. వారికి పెద్ద దిక్కయి నిలిచారని చెప్పారు. అణగారిన వర్గాలే కాకుండా సమాజంలో నిరాదరణకు గురైన వ్యక్తుల కుటుంబాలను సైతం ఆదుకున్నారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో చుండూరు, కారంచేడు దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రముఖ సామాజికవేత్త కత్తి పద్మారావు, దివంగత న్యాయవాది బొజ్జాతారకంతో కలిసి గద్దర్ అప్పటి ప్రభుత్వాలను ఒప్పించి ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.
పల్లె, పట్టణం, బస్తీ, గూడెం ఏకం చేస్తం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అన్ని రాజకీయ పార్టీలను, ఉద్యమ సంస్థలను ఏకం చేసిన వ్యక్తి గద్దర్అని తెలంగాణ మాల సంఘాల జాక్ చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. తెలంగాణ జాతిపితగా అన్ని అర్హతలున్న ఏకైక వ్యక్తి గద్దరే అని పేర్కొన్నారు. 6 బుల్లెట్లు దిగినా వాటిని శరీరంలోనే దాచుకుని నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన ఉద్యమాలు చేశారన్నారు. ఉద్యమం ద్వారానే తెలంగాణ సిద్ధిస్తుందని నమ్మిన వ్యక్తి గద్దర్అని పేర్కొన్నారు. ఆయనను జాతి పితగా గుర్తించేందుకు తెలంగాణ మాల సంఘాల ఆధ్వర్యంలో పల్లె, పట్టణం, బస్తీ, గూడెం అన్నింటినీ ఏకం చేస్తామని తెలిపారు. ప్రజా యుద్దనౌక గద్దర్ను తెలంగాణ జాతి పితగా ప్రకటించాలని గద్దర్ గళం సభ్యులు కొల్లూరి సత్యయ్య, కొల్లూరి భరత్ డిమాండ్ చేశారు. లేకపోతే ఏప్రిల్6న తెల్లాపూర్లోని గద్దర్ సర్కిల్వద్ద గద్దర్ గళం ఆధ్వర్యంలో భారీ బహింరగ సభ నిర్వహించి తామే ప్రకటిస్తామని అల్టిమేటం జారీ చేశారు.- - మందాల భాస్కర్
ముమ్మాటికీ జాతిపిత గద్దరే
తెలంగాణకు ముమ్మాటికీ జాతిపిత గద్దరే అని సామాజిక ఉద్యమకారుడు పృథ్వీరాజ్, జర్నలిస్టు పాశం యాదగిరి పేర్కొన్నారు. ‘‘జాతిపిత అంటే సబ్బండ వర్గాల ఆదరణ ఉన్న వ్యక్తి కావాలెగానీ..ఓ ఫ్యూడల్ భావాలున్న వ్యక్తిని జాతి పితగా ఎలా సంబోధిస్తారు. కేవలం ప్రజల ఆకాంక్షను ఓట్ల రూపంలో చేజిక్కించుకున్న వ్యక్తులకు జాతిపితలాంటి బిరుదులు ఆమోదయోగ్యం కాదు. రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని, సబ్బండ వర్గాల ఆమోదాన్ని పొందిన గద్దర్ను ప్రభుత్వం తెలంగాణ జాతి పితగా గుర్తించాలి” అని డిమాండ్ చేశారు. - పృథ్వీరాజ్, యాదగిరి
