ఆయుర్వేదంతో డెంగ్యూ చికిత్స.. కొబ్బరి, మెంతి నీరుతో లక్షణాల నివారణకు చెక్

ఆయుర్వేదంతో డెంగ్యూ చికిత్స.. కొబ్బరి, మెంతి నీరుతో లక్షణాల నివారణకు చెక్

భారతదేశంలోని అనేక నగరాల్లో డెంగ్యూ విజృంభిస్తోంది. ఈడిస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమలు కుట్టడం వల్ల ఈ జ్వరం వస్తుంది. ఉష్ణోగ్రత, వర్షం, తేమతో కూడిన వాతావరణంలో మార్పుల సమయంలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. డెంగ్యూ జ్వరం సాధారణ లక్షణాల విషయానికొస్తే.. వాంతులు, తీవ్రమైన తలనొప్పి, వికారం, చర్మంపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు, కళ్ల వెనుక నొప్పి, కండరాల నొప్పి ఉంటాయి. డెంగ్యూకు సకాలంలో చికిత్స చాలా ముఖ్యం. లేదంటే, ఈ వ్యాధి తీవ్రరూపాన్ని దాల్చవచ్చు. సకాలంలో చికిత్స చేయకపోతే, అలసట, వాంతిలో రక్తం, నిరంతర వాంతులు, చిగుళ్ళలో రక్తస్రావం, విశ్రాంతి లేకపోవడం, తీవ్రమైన కడుపు నొప్పి, వేగంగా రక్తస్రావం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

డెంగ్యూ లక్షణాల నివారణకు ఆయుర్వేదంలో కొన్ని నివారణలు ఉన్నాయి. వీటిని పాటించి ఈ జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు. డెంగ్యూ కోసం డాక్టర్ మీకు ఇచ్చిన మందులతో పాటు, మీరు త్వరగా కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్సను కూడా ప్రయత్నించవచ్చు.

1. కొబ్బరి నీరు

కొబ్బరి నీళ్లలో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది మీ ఆరోగ్యాన్ని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూ సాధారణ లక్షణం వాంతులు. ఇది శరీరంలో నిర్జలీకరణానికి కారణమవుతుంది. కొబ్బరి నీరు మీ శరీరంలో నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. అందువల్ల, దీన్ని ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోండి.

2. మెంతి నీరు

మెంతులు చాలా ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇది శక్తివంతమైన నొప్పి నివారిణి కూడా. మెంతికూరను రాత్రంతా నీటిలో నానబెట్టి, వడపోసి, ఉదయం తాగితే మంచి ఫలితముంటుంది.

3. బొప్పాయి ఆకులు

బొప్పాయి ఆకులు డెంగ్యూ చికిత్సకు ఒక ప్రసిద్ధ ఔషధం అని చెప్పవచ్చు, ఇది రోగనిరోధక శక్తిని పెంచి డెంగ్యూ లక్షణాల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ ఆకుల రసాన్ని తీసి రోజుకు కనీసం రెండు సార్లు తాగాలి.

4. జ్యూస్ తీసుకోండి

వేప ఆకులలో మ్యాజిక్ మెడిసిన్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో వైరస్ పెరుగుదల, వ్యాప్తిని నిరోధించడంలో దోహదపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. వీటిని కొద్దిసేపు నీళ్లలో మరిగించి వడగట్టి తాగాలి.

5. నారింజ రసం

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా శరీరానికి హైడ్రేషన్ కూడా అందుతుంది.