సాయుధ బలగాల్లో నాలుగేళ్లు విధులు పూర్తి చేసుకున్న తర్వాత త్రివిధ బలగాల్లో ఉద్యోగం నుంచి బయటికొచ్చిన అగ్నివీర్ లకు తమ ఉద్యోగ భర్తీల్లో వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని భారత రైల్వేశాఖ భావిస్తోంది.
అగ్నివీర్లకు రైల్వేలో నాన్-గెజిటెడ్ ఉద్యోగాల్లో రెండు అంచెల్లో 15% రిజర్వేషన్ లభించనుంది. దీంతోపాటు వయోపరిమితిలోనూ సడలింపు ఇవ్వనున్నారు. దేహదారుఢ్య పరీక్షల నుంచి వారికి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నారు.
దివ్యాంగులు (పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజేబిలిటీ-పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులు, యాక్ట్ అప్రంటీస్ కోర్సు పూర్తి చేసిన వారితో సమానంగా లెవెల్-1లో 10%, లెవెల్-2.. అంతకుమించిన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ను అగ్నివీర్లకు కల్పించాలని యోచిస్తున్నారు.
తొలిబ్యాచ్ వారికి ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్ల వారికి మూడేళ్లు చొప్పున సడలింపు ఇవ్వనున్నారు. నాలుగేళ్లు అగ్నివీర్లుగా ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వాలని జనరల్ మేనేజర్లకు రైల్వేబోర్డు లేఖలు పంపింది. భర్తీకాని ఖాళీలు ఉంటే ఇతరులతో వాటిని నింపాలని తెలిపింది. అగ్నివీర్ల కోసం రిజర్వేషన్ విధానాన్ని ఆర్పీఎఫ్ కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.