- 3వేల మంది పోలీసుల మోహరింపు..
- సీసీ టీవీ కెమెరాలతో లైవ్ క్యాప్చర్
- రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ పరిసరాల్లోనే సుమారు 3 వేల మంది పోలీసులను మోహరించారు. నాలుగంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజన్స్ వింగ్స్ ఏరియా డామినేషన్ పార్టీస్, రూఫ్ పార్టీస్తో నిఘా పెంచారు. భద్రతా ఏర్పాట్లపై సీపీ స్టీఫెన్ రవీంద్ర గురువారం సమీక్ష జరిపారు. కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ ఆందోళనలు చేసే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు.
పీఎం సెక్యూరిటీలో బ్లూ బుక్ రూల్స్
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) నిబంధనలకు తగ్గట్టుగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని భద్రతకు సంబంధించిన బ్లూ బుక్ రూల్స్ ప్రకారం ప్రణాళికలు రూపొందించారు. సీసీటీవీ కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేశారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు లైవ్ కెమెరాలు ఆన్లో ఉంచనున్నారు. ఎస్పీజీ ఆధీనంలో ఉన్న ఏరియాలతో పాటు హెచ్ఐసీసీ బయటి ప్రాంతాలను సీసీటీవీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకువచ్చారు.
వీవీఐపీల మూవ్మెంట్స్, ట్రాఫిక్ డైవర్షన్స్
వీవీఐపీలు, వీఐపీలు ట్రావెల్ చేసే రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. ప్రతిరోజూ టెలీ కాన్ఫరెన్సు ద్వారా స్థానిక పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నారు. వీఐపీల మూవ్మెంట్స్కు తగ్గట్టుగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేయనున్నారు. శని,ఆదివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ గురువారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నిర్ధేశించిన ప్రాంతాల్లోనే వాహదారులు ట్రావెల్ చేయాలని సూచించారు. ప్రధాని ఎక్కడ బస చేస్తారనేది రహస్యంగా ఉంచుతామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. రెండు ఆర్గనైజేషన్లు ప్రధాని టూర్ సందర్భంగా ఆందోళనలు చేస్తాయనే సమాచారం ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.
కాలనీలు, బస్తీల్లో తనిఖీలు
మాదాపూర్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్న హెచ్ఐసీసీ చుట్టూ 5 కిలోమీటర్ల మేర పోలీసులు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు, రాష్ట్ర ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు హెచ్ఐసీసీ చుట్టూ పక్కల ఉన్న కాలనీలు, బస్తీల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో కాలనీలు, బస్తీలకు వచ్చిన వారి వివరాలు తీసుకుంటున్నారు. హైటెక్స్ చుట్టూ ఉన్న ప్రైవేటు హాస్టళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.