భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజలను మెప్పించేలా పాలన ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కొత్తగూడెం క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సీపీఐ 47 సర్పంచ్స్థానాలు, 57 ఉప సర్పంచ్, 432వార్డు స్థానాల్లో విజయం సాధించిందన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే సీపీఐకి అత్యధికంగా ఓట్లు పోలయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయాలు చేశారని, స్నేహ సంబంధాన్ని నిలుపుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, నేతలు కల్లూరి వెంకటేశ్వర రావు, నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, దుర్గారాశి వెంకటేశ్వర్లు, పుల్లారెడ్డి, లక్ష్మీకుమారి, కె. సారయ్య, పూర్ణ చందర్ రావు పాల్గొన్నారు.
